పొన్నూరులో కిడ్నాప్ కలకలం | 5 years old boy kidnapped in ponnuru | Sakshi
Sakshi News home page

పొన్నూరులో కిడ్నాప్ కలకలం

Jul 28 2015 2:10 PM | Updated on Sep 3 2017 6:20 AM

గుంటూరు జిల్లాలో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది.

గుంటూరు: గుంటూరు జిల్లాలో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. బాబును అప్పగించాలంటే పదిలక్షల రూపాయలు ఇవ్వాలంటూ ఆగంతకుల నుంచి సమాచారం అందడంతో.. బాధితులు సోమవారం పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం ప్రకారం ... గుంటూరు జిల్లా పొన్నూరు మండల కేంద్రానికి చెందిన షేక్ ఇబ్రహీం మేస్త్రీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి షేక్ కరీముల్లా(5) అనే కుమారుడు ఉన్నాడు.

అడ్డా మీద పనికి వెళ్లేందుకు సిద్ధమైన ఇబ్రహీంను ఓ వ్యక్తి వచ్చి తనది నెల్లూరు జిల్లా అని ఇక్కడ స్థానికంగా లాడ్జిలో ఉంటూన్నానని తనకు పని ఇప్పించమని ప్రాధేయపడ్డాడు. దీంతో ఇబ్రహీం అతన్ని తనతో పాటు పనికి తీసుకెళ్లాడు. కాగా.. సోమవారం సాయంత్రం ఇబ్రహీం పని నుంచి తిరిగి వచ్చేసరికి ఇంట్లో తన ఐదేళ్ల కుమారుడు షేక్ కరీముల్లా కనిపించకుండా పోయాడు.

చుట్టపక్కల ఇళ్లలో వెతికినా లాభం లేకపోయింది. అయితే మంగళవారం ఉదయం ఆగంతకుడు ఇబ్రహీంకు ఫోన్ చేసి నీ బాబు నీవద్దకు క్షేమంగా చేరాలంటే రూ. పదిలక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ విషయం పోలీసులకు చెబితే బాబును చంపేస్తానని బెదిరించాడు. దాంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పని ఇప్పించమని తన వద్దకు వచ్చిన వ్యక్తి పేరు సతీష్ అని బాధితుడు గుర్తించాడు. అతడి స్వస్థలం పొన్నూరుగా గుర్తించారు. అతడే నిందితుడని పోలీసులు అనుమానిస్తున్నారు.  ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement