అదుపులో 124 మంది, 60 మంది హౌస్ అరెస్ట్ | 124 people in police custody, says east godavari district sp Ravi prakash | Sakshi
Sakshi News home page

అదుపులో 124 మంది, 60 మంది హౌస్ అరెస్ట్

Jun 11 2016 8:47 AM | Updated on Aug 21 2018 7:17 PM

అదుపులో 124 మంది, 60 మంది హౌస్ అరెస్ట్ - Sakshi

అదుపులో 124 మంది, 60 మంది హౌస్ అరెస్ట్

ముద్రగడ పద్మనాభం అరెస్టు తర్వాత శుక్రవారం ఇచ్చిన బంద్ పిలుపు ప్రభావం జిల్లాపై పడకుండా 144 సెక్షన్, సెక్షన్ 30లతో వ్యాపారులు స్వేచ్ఛగా దుకాణాలు తెరుచుకునే ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్ అన్నారు.

బంద్ వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనల్లేవు
కోనసీమపై ప్రత్యేక నిఘా
144, 30 సెక్షన్లు ఉల్లంఘిస్తే క్షమించేది లేదు
 
అమలాపురం టౌన్ : ముద్రగడ పద్మనాభం అరెస్టు తర్వాత శుక్రవారం ఇచ్చిన బంద్ పిలుపు ప్రభావం జిల్లాపై పడకుండా 144 సెక్షన్, సెక్షన్ 30లతో వ్యాపారులు స్వేచ్ఛగా దుకాణాలు తెరుచుకునే ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్ అన్నారు. బంద్ సందర్భంగా జిల్లాలో 144, 30 సెక్షన్లు ఉల్లంఘించిన 124 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

జిల్లాలో దాదాపు 60 మంది నాయకులను హౌస్ అరెస్టు చేశామన్నారు. అమలాపురం రూరల్ సీఐ కార్యాలయంలో శుక్రవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. బంద్ వల్ల జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, జిల్లాలో శాంతిభద్రతలు పూర్తి అదుపులోనే ఉన్నాయని ఎస్పీ వెల్లడించారు.
 
 ముద్రగడ రాజమండ్రి ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్నారు. ఈ పరిణామక్రమాల్లో జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఇతర జిల్లాల నుంచే అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపామని చెప్పారు. రాపిడ్ యాక్షన్ ఫోర్సు (ఆర్‌ఏఎఫ్), పారా మిలటరీ  బలగాలను కూడా రప్పించామన్నారు. ఇప్పటికే ఏఎన్‌ఎస్, సీఆర్‌పీఎఫ్ వంటి బలగాలు కూడా జిల్లా బందోబస్తులో ఉన్నాయని చెప్పారు. గోదావరి జిల్లాల్లో పలువురు వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాజమండ్రిలో జక్కంపూడి రాజా, పిఠాపురంలో పెండెం దొరబాబు, తణకులో చీర్ల రాధయ్య, పెదపాడులో అప్పన ప్రసాద్తో పాటు పలువురిని ముందస్తుగా గృహ నిర్భంధం చేశారు.
 
కోనసీమపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఈ సీమకు ఉన్న గత నేర చరిత్రపై అధ్యయనం చేసి గుర్తించిన ప్రాంతాల్లో నిఘా పెంచామని, ముఖ్యంగా రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలో కొందరు ఈ అవకాశం ముసుగులో అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తారని, ముఖ్యంగా జిల్లా ప్రజలు ఎలాంటి వదంతలు నమ్మకుండా పోలీసులకు సహకరించాలని సూచించారు. బంద్ తదితర అసౌకర్యాలకు వ్యాపారులు భయపడ వద్దని, వారికి పోలీసు వైపు పూర్తి రక్షణ ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. అనంతరం విజయనగరం ఏఎస్పీ ఏవీ రమణ, అమలాపురం డీఎస్పీ లంక అంకయ్య, సీబీ సీఐడీ డీఎస్పీ వెంకటరత్నం, అమలాపురం సీఐలు వైఆర్‌కే శ్రీనివాస్, జి.దేవకుమార్‌లతో సమీక్షించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement