చిన్నారిపై పైశాచికత్వం | 10 days Tortured a child | Sakshi
Sakshi News home page

చిన్నారిపై పైశాచికత్వం

Jul 16 2016 3:16 AM | Updated on Aug 30 2018 4:07 PM

అభం శుభం తెలియని చిన్నారిపై మృగాళ్లు పైశాచికత్వం ప్రదర్శించారు. పదిరోజుల పాటు శారీరకంగా, మానసికంగా హింసించారు.

- 10 రోజుల పాటు చిత్రహింసలు
- మేనమామ, మరో ఇద్దరి దుశ్చర్య
 
 కర్నూలు(హాస్పిటల్) : అభం శుభం తెలియని చిన్నారిపై మృ గాళ్లు పైశాచికత్వం ప్రదర్శించారు. పదిరోజుల పాటు శారీరకంగా, మానసికంగా హింసించారు. ఆసుపత్రికి తీసుకెళ్లి బాగు చేయిస్తానని చెప్పి, ఆ చిన్నారిని ఆసుపత్రి పాల్జేశారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల ప్రాంతానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్దకుమార్తె(10)కు ఓ చేయి, ఓ కాలు సరిగ్గా పనిచేయవు. ఆర్నెల్ల కిందట ఓ రోడ్డు ప్రమాదంలో తండ్రి చనిపోయాడు.దీంతో తల్లి కుమారుణ్ణి హాస్టల్‌లో ఉంచి, కుమార్తెలను వెంటబెట్టుకుని కర్నూలుకు వలస వచ్చింది.

స్థానిక బళ్లారి చౌరస్తా సమీపంలోని గురుబ్రహ్మనగర్‌లో ఓ గుడిసెలో  ఉంటూ కూలిపనులతో జీవనం సాగిస్తోంది.  ఈ క్రమంలో ఆమె పదేళ్ల కూతురుపై ఆటోడ్రైవర్ అయిన మేనమామ రాము(22) కన్నుపడింది. పాపను మంచి డాక్టర్ వద్ద చూపించుకుని వస్తానని తిరుపతికి తీసుకెళ్లాడు. పదిరోజులైనా కూతురు రాకపోవడంతో తల్లి అతనికి ఫోన్ చేస్తూనే ఉంది. చివరికి ఆరు రోజుల కిందట అతనే ఆ చిన్నారిని తీసుకొచ్చి తల్లి వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. తల్లి వద్దకు చేరుకున్న పాప జరిగిన సంఘటనను మొత్తం చెప్పింది.

రాముతో పాటు శిరీష్, వెంకటేశ్వర్లు అనే వాళ్లు రోజూ తనను తీవ్రంగా కొట్టేవారని, నోట్లో కారం పోసేవారని, చేతులు మెలితిప్పేవారని ఏడుస్తూ తెలిపింది. ఒక్కొక్కరు బట్టలు విప్పి తన వద్దకు వ చ్చే వారని వివరించింది. దీంతో ఏం చేయాలో తెలియని ఆ తల్లి చికిత్స కోసం కూతుర్ని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఈ నెల 12న చేర్పించింది. దీనిపై వైద్యులు శుక్రవారం పోలీసులకు సమాచారం అందించారు. నాల్లో పట్టణ సీఐ నాగరాజుయాదవ్ అక్కడికి చేరుకుని ఆ చిన్నారితో మాట్లాడి వివరాలు సేకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement