ఆరునెలలు వెంటపడ్డాడు.. తిరస్కరించిడంతో | Young Man Suicide With Love Affair In Srungavarapu kota | Sakshi
Sakshi News home page

ఆరునెలలు వెంటపడ్డాడు.. తిరస్కరించిందన్న కోపంతో

Jan 21 2020 7:53 AM | Updated on Jan 21 2020 9:33 AM

Young Man Suicide With Love Affair In Srungavarapu kota - Sakshi

ప్రేమిస్తున్నానంటూ ఆరునెలలుగా వెంటపడ్డాడు. ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో కత్తితో దాడిచేశాడు. గొంతు,  చేతిపై కత్తితో కోసాడు. చనిపోయిందని భావించి తనూ రైలు కింద పడి ఉసురు తీసుకున్నాడు. కుటుంబానికి కలకలం తెచ్చిన ఘటన వేపాడ మండలం బొద్దాం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం చోటుకుచేసుకుంది.  

సాక్షి, శృంగవరపుకోట:  ప్రేమిస్తున్నానంటూ ఆరునెలలుగా వెంటపడి వేధిస్తున్న యువకుడిని కాదన్నందుకు ఉన్మాదిలా మారాడు. విద్యార్థిని ప్రాణం తీయాలని హత్యకు తెగబడ్డాడు. హత్యాయత్నం తర్వాత ఆమె చనిపోయి ఉంటుందన్న భయంతో రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. వేపాడ మండలం బొద్దాం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.  పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్‌.కోట పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదివిన జామి మండలం చింతాడ గ్రామానికి చెందిన విద్యార్థిని వేపాడ మండలం బొద్దాం గ్రామంలోని తన మేనమామ ఇంటిలో ఉంటోంది. ఆరునెలలుగా అదే గ్రామానికి చెందిన పందిరిపల్లి కోటేశ్వరరావు(21) ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడి వేధిస్తున్నాడు.

దీనికి విద్యార్థిని ప్రతిస్పందించకపోవడంతో కసితో రగిలిపోయాడు. ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. మధ్యాహ్నం విద్యార్థిని మేనమామ మేడ పక్కన ఉన్న మేడపై కాపుకాశాడు. భోజనం తర్వాత మేనమామ మేడ కిందికి వెళ్లిపోగా, అతని భార్య నీళ్లు తెచ్చుకోవటానికి మేడ దిగి వెళ్లడాన్ని గమనించిన కోటేశ్వరరావు ఒక్కసారిగా ఇంటిలోకి చొరబడ్డాడు. 3.15 గంటల సమయంలో విద్యార్థిని మెడపై కత్తితో దాడి చేశాడు. రెండోసారి దాడిచేయడంతో విద్యార్థిని చేతిని అడ్డుగా పెట్టింది. దీంతో ఆమె ఎడమచేయి తెగిపోయింది. రక్తపుమడుగులో పడిపోవడంతో ఉన్నాదిగా మారిన యువకుడు పరారయ్యాడు.


ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు

బాధితురాలు, మేనమామ కొడుకు కేకలు వేయడంతో కింది నుంచి వచ్చిన కుటుంబీకులు వెంటనే ఎస్‌.కోట సీహెచ్సీకి విద్యార్థిని తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో కోలుకుంటోంది. హత్యాయత్నానికి పాల్పడిన కోటేశ్వరరావు పరారయ్యాడని పోలీసులు భావించారు. కాగా.. సాయంత్రం 6.30 గంటల సమయంలో పుణ్యగిరి రైల్వేగేటు సమీపంలో గుర్తు తెలియని మృతదేహం ఉందన్న సమాచారం తెలిసింది. అక్కడికి వెళ్లిన ఎస్‌ఐ రాజేష్‌, పోలీసులు.. హత్యాయత్నానికి పాల్పడిన కోటేశ్వరరావు అయి ఉండొచ్చన్న కోణంలో బాధితురాలి కుటుంబీకులకు ఫొటోలు చూపి ఆరా తీశారు. మృతుడు హత్యాయత్నానికి పాల్పడిన కోటేశ్వరరావు అంటూ నిర్ధారించారు. 

ప్రాణాలు తీయబోయి..   
తనను కాదన్న కసితో అమ్మాయి ప్రాణాలు తీసేందుకు తెగబడిన కోటేశ్వరరావు కిరండోల్‌ నుంచి కొత్తవలస వైపు వెళ్తున్న డౌన్‌ ట్రైన్‌ కిందపడి ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు వదిలాడు. రైల్వేట్రాక్‌పై రెండు చేతులు, తల, మొండెం వేర్వేరు చోట్ల చెల్లాచెదురుగా పడ్డాయి. మృతుడి స్వస్థలం విశాఖజిల్లా ఆనందపురం మండలం రెడ్డిపల్లి గ్రామం. భర్త చనిపోవడంతో మృతుని తల్లి గణపతి చాలా ఏళ్ల కిందటే తన కన్నవారి గ్రామం బొద్దాం చేరుకుంది. ఇక్కడ కూలి పనులు చేసుకుంటూ కుమార్తె ప్రసన్న, కొడుకు కోటేశ్వరరావులను పోషిస్తోంది. ప్రసన్న ఏఎన్‌ఎం శిక్షణ పూర్తిచేయగా.. మృతుడు ఐటీఐ చదివాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్న బాధితురాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు వల్లంపూడి ఎస్‌ఐ జి.రాజేష్‌ చెప్పారు. విజయనగరం జీపీఆర్‌ఎఫ్‌ పోలీసులు కేసు నమోదు చేయనున్నట్టు రైల్వే అధికారులు చెప్పారు.  

చదవండి: ధర్మవరం పోలీసుల దొంగాట

Advertisement
 
Advertisement
Advertisement