చేయని నేరానికి శిక్ష

Young Man  Drugs Case In Jagtial - Sakshi

కోండ్ర సుబ్బారెడ్డి, సారంగాపూర్‌ (జగిత్యాల జిల్లా):  రెక్కాడితే డొక్కాడని కుటుంబం అది. ఉన్న కొద్దిపాటి భూమిని తల్లిదండ్రులు సాగు చేస్తుండగా.. వారి ఇద్దరి కొడుకులు జీవనోపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లారు. అయితే, పెద్ద కుమారుడు చేయని నేరానికి శిక్ష అనుభవి స్తున్నాడు. రెండున్నర నెలలుగా దుబాయ్‌ జైళ్లో మగ్గుతున్నాడు. జైలు నుంచి తన కొడుకును విడిపించాలని ఆ యువకుడి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
 
జగిత్యాల జిల్లా సారంగాపూర్‌ మండలం పోతారం గ్రామానికి చెందిన గుర్రం రాజేశం, లక్ష్మీలకు ఇద్దరు కుమారులు. వీరికి ఉన్న ఎక రం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా.. పెద్దకుమారుడు శ్రీనివాస్, చిన్న కుమారుడు మహేష్‌ జీవనోపాధి కోసం గల్ఫ్‌ వెళ్లివస్తున్నారు. పెద్ద కొడుకు శ్రీనివాస్‌కు మూడు  సంవత్సరాల క్రితం లావణ్యతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. శ్రీనివాస్‌ రెండు సంవత్సరాల క్రితం దుబాయ్‌ వెళ్లి కొద్ది రోజులకు తిరిగి వచ్చాడు. ఆ తర్వాత ఆరునెలల క్రితం మస్కట్‌కు కంపెనీ వీసా మీద వెళ్లాడు. అదే కంపెనీలో పనిచేస్తుండగా.. బంగ్లా దేశ్‌కు చెందిన కొంత మంది తమకు మద్యం తీసుకురావాలని శ్రీనివాస్‌కు సూచిం చడంతో శ్రీనివాస్‌ వారికి మద్యం తీసుకవచ్చి ఇచ్చాడు. అయితే వ్యక్తిగత కక్షలు మనసులో పెట్టుకున్న బం గ్లాదేశ్‌ యువకులు శ్రీనివాస్‌కు మద్యం తీసు కవచ్చిన డబ్బులు చేతికి ఇస్తూనే ఆ డబ్బుల్లో డ్రగ్స్‌ ప్యాకెట్‌ను ఉంచారు.

శ్రీనివాస్‌ వద్ద డ్రగ్స్‌ ప్యాకెట్లు ఉన్నాయని పథకం ప్రకారం  అక్కడి పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు వచ్చి శ్రీనివాస్‌ వద్ద డ్రగ్స్‌ ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకొని అతడిని అరెస్టు చేశారు. రెండున్నర నెలలుగా శ్రీనివాస్‌ జైల్‌లో ఉన్నాడు. తనకు బయటకు తీసుకురావాలని అక్కడి నుంచి శ్రీనివాస్‌ రెండు రోజులకోసారి ఫోన్‌చేస్తూ రోదిస్తుండడంతో.. ఇక్కడ తల్లి లక్ష్మీ, తండ్రి రాజేశం, భార్య లావణ్య కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ విషయంపై స్థానిక నాయకుల సహాయంతో రాజేశం ఎంపీ కవితను కలిసి తమ కొడుకును స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. కుటుంబ సభ్యులంతా శ్రీనివాస్‌ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top