రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

Young Man Died In parakala - Sakshi

సాక్షి, పరకాల(వరంగల్‌) : శాయంపేట మండలంలోని మాందారిపేట గుట్టల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పరకాల పట్టణానికి చెందిన ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. పరకాల పట్టణానికి చెందిన గోవింద మణికంఠ(25) హన్మకొండ నుంచి పరకాల వైపు ద్విచక్ర వాహనం(స్కూటీ)పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో కాళేశ్వరం నుంచి హన్మకొండ వైపు వస్తున్న తవేరా వాహనం వచ్చి బలంగా ఢీ కొట్టింది. దీంతో తలకు బలమైన గాయం కావడంతో మణికంఠ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందగానే సంఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యుల రోదనలు పలువురికి కంటతడి పెట్టించాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరకాల సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. ద్విచక్రవాహనంను ఢీ కొట్టగానే అక్కడి నుంచి తవేరా డ్రైవర్‌ పరారీ అయినట్లు స్థానికులు  తెలిపారు.

తండ్రీకొడుకులు కానరాని లోకాలకు..
పరకాల పట్టణంలోని అంబేద్కర్‌ సెంటర్‌లో కూల్‌డ్రింక్స్‌ అమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న గోవిందా రమాదేవి భర్త భద్రయ్య ఏడాదిన్న క్రితం అనారోగ్యంతో మృతిచెందగా కుమారుడు మణికంఠ మరణం తీరని విషాదం నెలకొల్పింది.  తన కుటుంబానికి పెద్దదిక్కుఅవుతాడనుకున్న తరుణంలో రోడ్డు ప్రమాదంలో కుమారుడు సైతం కానరాని లోకాలకు వెళ్లడంతో రమాదేవి, కూతుళ్లు కన్నీటిని ఆపటం ఏవరితరం కాలేదు. రమాదేవికి నలుగురు కూతుళ్లు ఉండగా ముగ్గురికి వివాహం జరిగింది. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యడ శ్రీనివాస్‌ కోరారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top