బస్సు ఢీకొని మహిళ దుర్మరణం

Women Died In Road Accident - Sakshi

పెదవాల్తేరు(విశాఖ తూర్పు): భర్త కళ్లెదుటే దారుణం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సిటీ బస్సు ఢీకొనడంతో ఒక వివాహిత అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యింది. ఈ దుర్ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మధురవాడ దరి కొమ్మాది సాయిరాం కాలనీకి చెందిన యతిరాజుల రోజా (21)కి శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం సింగూరు గ్రామానికి చెందిన గురుగుబిల్లి జగదీశ్వరరావుతో 2017 ఫిబ్రవరిలో వివాహం జరిగింది.

జగదీశ్వరరావు ఆర్మీలో పనిచేస్తున్నారు. దీంతో రోజా తల్లిదండ్రుల వద్దనే ఉంటుంది. రోజా ప్రస్తుతం రామాటాకీస్‌ దరి శ్రీనగర్‌లో గల ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ఆఖరి సంవత్సరం చదువుతోంది. ఆర్మీ నుంచి జగదీశ్వరరావు ఆదివారమే కొమ్మాదిలోని అత్తవారింటికి  వచ్చాడు. వీరిద్దరూ సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై కోస్టల్‌ బ్యాటరీలో గల నేవల్‌ క్యాంటీన్‌కి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మార్గ మధ్యలో కొత్త వెంకోజీపాలెం పెట్రోల్‌ బంక్‌ జంక్షన్‌ దాటిన తరువాత వెనుక నుంచి వచ్చిన 52డీ సిటీబస్‌ (వాల్తేరు డిపో) ఢీకొట్టింది.

దీంతో రోజా రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందింది. కళ్లెదుటే భార్య మరణించడంతో జగదీశ్వరరావు తట్టుకోలేక కన్నీటిపర్వంతమయ్యాడు. మూడో పట్టణ ట్రాఫిక్‌ పోలీసులు మృతదేహాన్ని అంబులెన్సులో కేజీహెచ్‌కి తరలించారు. సీఐ మళ్ల మహేశ్వరరావు పర్యవేక్షణలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top