వరకట్నం వేధింపులకు గర్భిణి బలి | women committed suicide | Sakshi
Sakshi News home page

వరకట్నం వేధింపులకు గర్భిణి బలి

Jun 11 2018 3:25 PM | Updated on Jun 11 2018 3:25 PM

women committed suicide - Sakshi

మృతిచెందిన అమృతమ్మ 

బషీరాబాద్‌(తాండూరు): వరకట్న దాహనికి ఓ ఇల్లాలు బలైంది.  పెళ్లై నాలుగేళ్లు గడుస్తున్నా భర్త వేధింపులు మాత్రం ఆగలేదు. పెళ్లినాడు ఇచ్చిన మాట ప్రకారం మిగిలిన వరకట్నం పుట్టింటి నుంచి తీసుకురావాలని భర్త పెడుతున్న వేధింపులకు తాళలేక ఏడు నెలల గర్భవతి అయిన భార్య పురుగుల మందుతాగి బలవన్మరణానికి పాల్పడింది.

ఈ ఘటన బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నీళ్లపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ లక్ష్మయ్య, మృతురాలి బంధువులు తెలిపిన వివరాలప్రకారం.. నీళ్లపల్లి గ్రామానికి చెందిన తలారి ఆంజనేయులు, అమృతమ్మ(22) భార్యభర్తలు. వీరికి నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది.

ఈ దంపతులకు  కూతురు భావ్యశ్రీ(3) ఉంది. వీరు హైదరాబాద్‌లో పనిచేస్తూ అక్కడే కాపురం పెట్టారు. కొన్ని నెలల కిందట స్వంత గ్రామం నీళ్లపలికి తిరిగి వచ్చారు. అయితే తనకు ఆరోగ్యం బాగాలేదని, ఆస్పత్రిలో చూపించాలని భర్త ఆంజనేయులుకు చెప్పింది భార్య. దీనికి భర్త అగ్గిమీద గుగ్గిలంలా భార్య అమృతమ్మను దూశిస్తూ.. ‘మీ పుట్టింటికి వెళ్లి  మిగిలిన వరకట్నం డబ్బులు తీసుకొనిరా.. అప్పుడు నీకు ధవఖానాకు చూపిస్తా..’ అంటు బదులిచ్చాడు.

అంతడితో ఆగకుండా భార్యను మానసికంగా, శారీరకంగా బాధపెట్టాడు. దీనికి తోడు అత్త వెంకటమ్మ కూడా కొడుకుకు అండగా నిలచి వేధింపులకు గురిచేసింది. దీంతో తీవ్ర మనస్థాపానికి లోనైన ఆమె అదే రోజు ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్లి పోయింది. రాత్రికి పురుగుల మందు తాగి ఇంటికి చేరుకుంది.     విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. రాత్రంతా అలాగే ఇంట్లోనే ఉంది.

అయితే విషం శరీరంలోకి పాకడంతో తీవ్ర అస్వస్థకు గురైంది. గమనించిన కుటుంబæ సభ్యులు ఆదివారం తెల్లవారు జామున ఆమెను తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వికారాబాద్‌లోని మిషన్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం అక్కడి నుంచి మొరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 11.30 గంటలకు ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తల్లితో పాటు కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా కండ్లు తెరవకుండానే మృతిచెందింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి శాంతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమృతమ్మ భర్త ఆంజనేయులు, అత్త వెంకటమ్మలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపారు. శవపంచనామ అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement