- కట్నం వేధింపులకు వివాహిత బలి
- భర్త, మామ అరెస్ట్
- పెళ్లైన మూడేళ్లకే విషాదం
- పుట్టింటివారి ఆరోపణలతో రంగంలోకి పోలీసులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ పశ్చిమ ప్రాంతంలో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కట్నం కోసం వేధించడంతో పాటు, సంతానం కలగలేదనే నెపంతో అత్తవారింట్లో ఎదురైన వేధింపుల వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తును వేగవంతం చేశారు.
కిటికీ గ్రిల్కు మృతదేహం.. అనుమానాస్పద మృతి
పశ్చిమ ఢిల్లీలోని రఘుబీర్ నగర్లో అద్దె ఇంట్లో నివసిస్తున్న 24 ఏళ్ల మహిళ తన నివాసంలో విగతజీవిగా కనిపించింది. ఉదయం 7 గంటల ప్రాంతంలో పోలీసులకు ఫోన్ రావడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతి మెడపై ఉరి వేసుకున్నట్లుగా గుర్తులు ఉండటంతో పాటు, కిటికీ గ్రిల్కు ఒక దుపట్టా కట్టి ఉంది. ప్రాథమిక విచారణలో ఇది ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికీ, ఘటనా స్థలంలో ఉన్న పరిస్థితులపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఆర్డీఓ విచారణ
మృతి చెందిన మహిళకు వివాహమై కేవలం మూడేళ్లే కావడం, అలాగే దంపతులకు పిల్లలు లేకపోవడంతో చట్టప్రకారం ఈ కేసును సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లారు. వివాహమైన ఏడేళ్ల లోపు మహిళ అనుమానాస్పదంగా మరణిస్తే ఆర్డీఓ విచారణ జరపడం నిబంధన. దీంతో మృతురాలి తల్లిదండ్రుల స్టేట్మెంట్ను ఎస్డిఎమ్ రికార్డు చేశారు. అదనపు కట్నం కోసం వేధించడం, సంతానం కలుగలేదంటూ నిందించడం వల్లే తమ కుమార్తె ఈ నిర్ణయం తీసుకుందని వారు వాంగ్మూలం ఇచ్చారు.
నిందితులు అరెస్ట్.. పోలీసుల దర్యాప్తు
బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 80 (కట్నపు చావు), సెక్షన్ 85 (మహిళపై క్రూరత్వం) కింద కేసు నమోదు చేశారు. పాత బట్టలు తీసుకుని గిన్నెలు అమ్మే వీధి వ్యాపారులుగా పనిచేసే నిందితులు (భర్త, మామ) పరారయ్యారు. అయితే సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు గురువారం దిల్లీలోనే వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతోంది.
ఇది కూడా చదవండి: ‘ట్రంప్ కన్నా పుతిన్ బెటర్’.. తేల్చేసిన భారతీయులు


