దాడి బాలాజీపై భార్య ఫిర్యాదు

Wife Nithya Complaint on Husband Dhadi balaji - Sakshi

చెన్నై, పెరంబూరు: నటుడు దాడి బాలాజీపై అతని భార్య నిత్య మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుల్లితెర యాంకర్, హస్యనటుడు దాడి బాలాజి అతని భార్య నిత్య మధ్య కొంత కాలం క్రితమే మనస్పర్థల కారణంగా విడిపోయారు. వీరి వ్యవహారం కేసులు, కోర్టుల వరకూ వెళ్లింది. ఇద్దరు విడివిడిగా నివశిస్తున్నారు. నిత్య తన కూతురితో మాధవరం, శాస్త్రి నగర్‌లో నివశిస్తోంది. కాగా దాడిబాలాజి, నిత్య ఇద్దరూ ఆ మధ్య జరిగిన బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షోలో పాల్గొన్నారు.

ఆ గేమ్‌ షోలో కూడా వీరిద్దరూ ఘర్షణ పడడం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో బుధవారం మాధవరం పోలీస్‌స్టేషన్‌లో దాడి బాలాజీపై ఫిర్యాదు చేసింది. అందులో బాలాజీ మళ్లీ మద్యం తాగి వచ్చి గొడవ చేస్తున్నాడని, గత జనవరి నెల 21న తాగి వచ్చి ఇంటి కిటికీలు పగులగొట్టి రగడ చేయడంతో పాటు ఫోన్‌లో అసభ్యంగా తిట్టి, హత్యాబెదిరింపులకు పాల్పడ్డాడని పేర్కొంది. అదే విధంగా తమ వివాహ రద్దు కేసు కోర్టులో ఉండగా బాలాజి మద్యం తాగి వచ్చి గొడవ చేయడంతో అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో భాగంగా దాడి బాలాజీకి ఫోన్‌ చేయగా, అతని తాను షూటింగ్‌ నిమిత్తం వేరే ఊరికి వచ్చానని, తిరిగి రాగానే విచారణకు హాజరవుతానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top