
మృతుడి కుమారుడు, భార్యను విచారిస్తున్న సీఐ
బాన్సువాడ టౌన్: నిత్యం మద్యం సేవించి భార్యను వేధింపులకు గురి చేసిన భర్తను వాటి నుంచి విముక్తి కోసం కట్టుకున్న భర్యనే భర్తను కుమారుడి సహాయంతో హత్య చేసింది. ఇంటి పక్కనే ఉన్న పాత ఇంట్లో పూడ్చి పెట్టిన సంఘటన బాన్సువాడలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పిట్లం మండలం చిల్లెర్గి గ్రామానికి చెందిన మంగలి సాయిలు(50), దెగ్లూర్కు చెందిన ఎందోళ్ల సునంద దంపతులు. జీవనోపాధి కోసం 15 ఏళ్ల కిత్రం బాన్సువాడకు వచ్చారు. పట్టణంలోని సంగమేశ్వర కాలనీ రోడ్డు–4లో ఉంటున్నారు. వీరికి కిరణ్, శ్రీనివాస్ అనే ఇద్దరు కుమారులు. కిరణ్ హైదరాబాద్లో హోటల్లో పని చేస్తున్నాడు. శ్రీనివాస్ తల్లి దగ్గర ఉంటున్నాడు. బాన్సువాడలోని ఓ హెర్ కటింగ్ సెలూన్లో సాయిలు పని చేస్తున్నాడు. మద్యంకు బానిసై డబ్బుల కోసం నిత్యం భార్యను కొట్టి, చిత్ర హింసలకు గురిచేసేవాడని స్థానికులు పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్ నుంచి పెద్ద కుమారుడు కిరణ్ బాన్సువాడకు వచ్చాడు.
ఇదే క్రమంలో ఈనెల 20న అర్ధరాత్రి సాయిలు భార్య సునంద, కుమారుడి కిరణ్తో గొడవ పడ్డాడు. ఇంట్లో ఉన్న రోకలి బండతో సాయిలు తలపై కిరణ్ బలంగా కొట్డాడు. చనిపోయాడో లేదోనని కరెంట్ షాక్ కూడా పెట్టారు. అర్ధరాత్రి దాటాక ఇంటి పక్కనున్న పాత ఇంట్లో గుంత తవ్వి సాయిలు మృతి దేహాన్ని పూడ్చిపెట్టారు. సోమవారం రెండు రోజులుగా సాయిలు కనిపించడంలేదని, మృతుడి బావ కిష్టాపూర్కు చెందిన మంగళి నాగయ్య వద్దకు వెళ్లి సునంద చెప్పింది. దీంతో మృతుడి బావ నాగయ్య, మృతుడి అన్న చిల్లెర్గి విఠల్ ఇద్దరు కలిసి సంగమేశ్వర కాలనీలో వాకబు చేశారు. మృతుడి భార్య, కుమారుడిపైనే అనుమానం ఉందని కాలనీవాసులు చెప్పడంతో నాగయ్య, విఠల్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం కేసుగా నమోదు చేశారు. మృతుడి భార్య సునందను, కుమారుడు కిరణ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. సీఐ శేఖర్రెడ్డి మృత దేహం పాతిన ప్రదేశాన్ని, హత్యకుపయోగించిన రోకలి బండ, విద్యుత్ తీగలను పరిశీలించారు. తహసీల్దార్ సమక్షంలో నిందితులు చెప్పిన పాత ఇంట్లో ఉన్న మృతి దేహాన్ని వెలికి తీస్తామని సీఐ అన్నారు. ప్రస్తుతం అదృశ్యం కేసు నమోదు చేశామని, మంగళవారం మృత దేహం లభిస్తే హత్య కేసుగా నమోదు చేస్తామని ఆయన అన్నారు.