మటన్‌ కర్రీ గొడవ.. భర్తను చంపేసిన భార్య

Wife Killed Husband On Mutton Curry Conflict Karnataka - Sakshi

బనశంకరి: మద్యం మత్తులో ఉన్న భర్త మటన్‌ కూర చేసి పెట్టాలని హుకుం జారీ చేయడంతో పాటు దూషించడంతో కోపోద్రిక్తురాలైన భార్య అతన్ని అంతమొందించింది. ఈ ఘటన కుమారస్వామిలేఔట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.... బనశంకరి సమీపంలోని ప్రగతిపురలో  నివాసం ఉంటున్న గోపాల్‌(44)కు తమిళనాడు కు చెందిన రుద్రమ్మ(35)తో 15 ఏళ్లు క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. మద్యానికి బానిసైన గోపాల్‌  పనులకు వెళ్లకుండా జులాయిగా తిరిగేవాడు. రుద్రమ్మ పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఆదివారం రాత్రి పీకల దాకా మద్యం సేవించిన గోపాల్‌ ఇంటికి చేరుకుని తనకు మటన్‌ కూర వండాలని భార్యకు సూచించాడు.

ఈక్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కింది అంతస్తులో ఉంటున్న  రుద్రమ్మ తల్లిదండ్రులు పైక ?చేరుకొని  గోపాల్‌ కాళ్లు చేతులు కట్టివేసి బంధించారు. మద్యం మత్తులో ఉన్న గోపాల్‌ నిద్రలోకి జారుకున్నారు. అనంతరం రుద్రమ్మ తల్లిదండ్రులు వారి ఇంట్లోకి వెళ్లిపోయారు.  అర్ధరాత్రి  సమయంలో మెలుకువ వచ్చిన గోపాల్‌ భార్యను తీవ్రపరుషపదజాలంతో దూషించాడు.  కోపోద్రిక్తురాలైన రుద్రమ్మ చీరతో గొంతుబిగించి భర్తను హత్య చేసింది. మరుసటిరోజు  మృతదేహన్ని తమిళనాడు కు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని పథకం పన్నింది. సాధ్యంకాక తన భర్త అనారోగ్యంతో మృతిచెందినట్లు  నాటకమాడింది. ఈమేరకు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చింది. అయితే మృతుడి గొంతుపై గాయం గుర్తు ఉండటంతో  పోలీసులు రుద్రమ్మ, ఆమె తల్లిదండ్రులను తమదైనశైలిలో విచారణ చేపట్టారు. దీంతో తానే గోపాల్‌ను హత్యచేసినట్లు రుద్రమ్మ నోరువిప్పింది. కేసు దర్యాప్తులో ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top