ఎనిమిదేళ్ల పగతో భర్తను.. | Wife Brutally Murdered Husband In Jagtial | Sakshi
Sakshi News home page

ఎనిమిదేళ్ల పగతో భర్తను..

Jun 27 2018 10:49 AM | Updated on Jul 27 2018 2:26 PM

Wife Brutally Murdered Husband In Jagtial - Sakshi

గొల్లపల్లి(ధర్మపురి): జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దట్నూర్‌లో దారుణహత్య జరిగింది. కుటుంబ కలహాలతో భార్య భర్తను సిమెంటురాయితో మోది, మారణాయుధాలతో దాడి చేసి హతమార్చింది. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఇందుకు తన పిల్లల సహకారం తీసుకున్నట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. స్థానికుల వివరాల ప్రకారం.. దట్నూర్‌ గ్రామానికి చెందిన అలిశెట్టి రమేష్‌(50)కు భార్య రమ, కుమార్తెలు నాగరాణి(17), నవ్య(13), కొడుకు గవాస్కర్‌(15) ఉన్నారు. రమేష్‌ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే కొద్దిరోజులుగా కుటుంబంలో గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రమేశ్‌ కుటుంబ సభ్యు లు అందరూ కలిసి మంగళవారం వ్యవసాయ భూమి వద్దకు వెళ్లారు. అందులో పసుపు కొమ్ములు నాటి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. రాత్రి 8 గంటల సమయంలో వం టకోసమై కోడిగుడ్లు తీసుకురావడానికి రమేశ్‌ కిరాణా దుకాణానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి చేరుకోగానే చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో భార్య రమ, కూతురు నాగమణి కలిసి రమేశ్‌పై దాడికి దిగారు. రమ సిమెంట్‌ ఇటుకతో రమేశ్‌ తలపై మోదింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న రమేశ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో దగ్గరికి వస్తే తమనూ చంపేస్తానని రమ హెచ్చరించడంతో వెనకడుగు వేశారు. ఇంతలో కొన ఊపిరి తో కొట్టుమిట్టాడుతున్న రమేశ్‌పై మరోసారి మారణాయుధాలతో దాడి చేసింది రమ. దీంతో రమేశ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. నిందితురాలు పరారీలో ఉందని గొల్లపల్లి ఎస్సై కిరణ్‌కుమార్‌ తెలిపారు.

తండ్రి హత్యే కారణమా..? 
అయితే రమేశ్‌ హత్య వెనుక కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రమేశ్‌ తన మామ(భార్య రమ తండ్రి) కొండి మల్లయ్యను 2010లో గొడ్డలితో నరికి చంపాడు. అప్పటి నుంచి పగ పెంచుకున్న రమ ప్రతీకారంగానే తన భర్తను చంపినట్లు తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement