భర్త హత్య కేసులో భార్య అరెస్టు
చెన్నై, అన్నానగర్:తిరువైయ్యారు సమీపంలో భర్తని హత్య చేసిన కేసులో సోమవారం ఆ వ్యక్తి భార్య, మామ అరెస్టు చెయ్యబడ్డారు. హతుడు అరియలూర్ జిల్లా ఏలాకురిచ్చి కాట్టూర్కు చెందిన మునియప్పన్ (35). ఇతను తన మేనమామ పళమిస్వామి (50) కుమార్తె మారియమ్మాల్ (25)ని వివాహం చేసుకున్నాడు. వీరికి రెండున్నర సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. మునియప్పన్, జనరల్ పని శాఖ కార్యాలయంలో సెక్యూరిటీగా పని చేస్తూ వచ్చాడు. ఇతనికి మద్యం సేవించే అలవాటు ఉండడంతో భార్యతో ఘర్షణ పడేవాడు. దీంతో మారియమ్మాల్ తన పుట్టింటికి వచ్చింది. మునియప్పన్ భార్యని చూడటానికి గత నెల 21న మామ ఇంటికి వచ్చాడు. మారియమ్మాల్ అన్న ఇటీవల మృతి చెందాడు. అతని అంత్యక్రియలకి మునియప్పన్ వెళ్లలేదు. ఈ విషయం గురించి మునియప్పన్ని మారియమ్మాల్ అడిగింది.
అప్పుడు వారికి మధ్య తగాదా ఏర్పడింది. ఆవేశం చెందిన మారియమ్మాల్, ఆమె తండ్రి పళణిస్వామి ఇద్దరు కలిసి మునియప్పన్పై దాడి చేసి గొంతుని తాడుతో నులిమి హత్య చేశారు. తరువాత మృతదేహాన్ని కిరోసిన్ పోసి కాల్చి, ఇంటి వెనుక భాగంలో గొయ్యి తవ్వి పాతిపెట్టారు. అయితే మునియప్పన్ విధులకు హాజరు కాకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మారియమ్మాల్, పళణిస్వామి ఇద్దరిని పోలీసులు సోమవారం అరెస్టు చేసి, మునియప్పన్ దేహం పాతిపెట్టబడిన స్థలానికి వెళ్ళారు. సోమవారం మధ్యాహ్నం తిరువైయ్యారు తహశీల్దార్ ఇళమ్మారుతి, తిరువైయ్యారు జాయింట్ పోలీసు సూపరింటెండెంట్ పెరియన్నన్, పోలీసు ఇన్స్పెక్టర్ జగదీషన్, సబ్–ఇన్స్పెక్టర్ కరుణాకరన్ పర్యవేక్షణలో మృతదేహం తవ్వి తీశారు. తంజావూరు మెడికల్ కళాశాల ఆస్పత్రి డాక్టర్ ఉదయభాణు ఆధ్వర్యంలో డాక్టర్లు మునియప్పన్ మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. అనంతరం కొల్లడమ్ నది తీరం సమీపంలో మునియప్పన్ మృతదేహాన్ని పాతిపెట్టారు. మారియమ్మాల్, పళణిస్వామి పోలీసుల అదుపులో ఉన్నారు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు