గ్వాలియర్‌ టు.. సిద్దిపేట

Tyre Thieves Arrested In Siddipet District - Sakshi

సెల్‌ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా కూపీ

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో దొంగల గుర్తింపు

మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న జిల్లా పోలీసులు అంతర్‌ జిల్లానే కాదు.. అంతర్‌ రాష్ట్ర దొంగల గుట్టురట్టు చేశారు. సిద్దిపేటలో నేరం చేసిన వారిని మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్వాలియర్‌ ప్రాంతానికి చెందిన టైర్ల దొంగలుగా గుర్తించారు. వీరిని సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా పట్టుకున్నారు.  ప్రస్తుతం వేలిముద్రలు, సీసీ కెమెరాలు, ఫేస్‌ రికగ్నైజ్‌డ్‌ సిస్టం(ఎఫ్‌ఆర్‌ఎస్‌) తదితర సాధనాలే నేరస్తులను పట్టుకునేందుకు కీలకంగా మారాయి.
సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని కోహెడ మండలం బస్వాపూర్‌ గ్రామానికి చెందిన తాటిపాముల రమేశ్‌ సెప్టెంబర్‌ 21న ఆ గ్రామ శివారులో లారీని ఉంచి ఇంటికి వెళ్లి నిద్రపోయాడు. ఉదయం లేచి చూసేసరికి లారీ కనిపించలేదు. ఈ విషయాన్ని కోహెడ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు బస్వాపూర్‌ నుంచి లారీని చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్‌ గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి ఆ లారీకి ఉన్న 14 టైర్లు, డెక్స్, బ్యాటరీ, ఇతర సామగ్రిని తేసుకెళ్లారు. మొత్తం రూ.10 లక్షల విలువగల వస్తువులను దొంగిలించారు. 
సిగ్నల్‌ ఆధారంగా గుర్తింపు

  • లారీ అపహరణపై ఫిర్యాదు అందుకున్న సిద్దిపేట స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు ముందుగా లారీ నిలిపిన స్థాలాన్ని పరిశీలించారు.
  • ముందుగా డ్రైవర్, క్లీనర్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించారు. కానీ ఆధారాలు లభించలేదు.
  • ఆ రాత్రి బస్వాపూర్‌ నుంచి సిద్దిపేట వరకు ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. దీంతో ఆ లారీ సిద్దిపేట నుంచి కరీంనగర్‌ వైపు రాజీవ్‌ రహదారి వెంబడి వెళ్లినట్లు గుర్తించారు. 
  •  అలాగే ముందుకు వెళ్లిన పోలీసులకు టైర్లు, బ్యాటరీ, ఇతర వస్తువులు లేకుండా రాళ్లపై ఉంచిన లారీ గుర్తించారు.
  • లారీ ఆపిన బస్వాపూర్, లారీ టైర్లు తీసిన ఇబ్రహీంనగర్‌ పాయింట్లను ప్రామాణికంగా తీసుకొని అక్కడి నుంచి ఎవరెవరు, ఎక్కడికి మాట్లాడిన డైటా సేకరించారు. 
  •  సీసీ ఫుటేజీలో లారీ దొంగలను చూసిన పోలీసులు దొంగలు మన రాష్ట్రానికి చెందిన వారు కాదని గుర్తించారు. 
  •  దీంతో ఫోన్‌కాల్స్‌పై దృష్టి సారించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఫోన్‌ కాల్స్‌ ముందుగా గుర్తించారు. వారిలో పాత నేరస్తుల ఫోన్‌ నంబర్‌తో సరిచూశారు. 
  •  నంబర్లు సరిపోలడంతో దొంగతనానికి పాల్పడిన వారిని గుర్తించారు. వారు మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్వాలియర్‌కు చెందిన వారిగా గుర్తించారు.
  •  దీంతో జిల్లా నుంచి నలుగురు పోలీసుల బృందం గ్వాలియర్‌కు వెళ్లి నేరస్తుల ఆచూకీ తెలుసుకున్నారు. 
  •  అక్కడి పోలీసుల సహకారంతో లారీ దొంగతనంతో సంబంధం ఉన్న ఆరుగురిని పట్టుకొని విచారణ చేశారు. 
  •  నేరం రుజువు కావడంతో ఆరుగురు నేరస్తులను రిమాండ్‌కు పంపించారు. 

నూతన పరిజ్ఞానంతో సులభం
నూతన సాంకేతిక పరిజ్ఞానం, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్న ఉద్యోగుల సహకారంతో నేరస్తులను పట్టుకోవడం సులభతరం అవుతోంది. జిల్లాలోని 420 గ్రామాలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. టెలికమ్యూనికేషన్‌ రంగం ద్వారా పలు విషయాలను సేకరించాం. వేలి ముద్రల సేకరణ ఇతర అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకొంటున్నాం. దీంతో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. –జోయల్‌ డేవిస్, పోలీస్‌ కమిషనర్‌

సాంకేతిక పరిజ్ఞానం      కేసులు          రికవరీ
సీసీ కెమెరాల ద్వారా    85 కేసులు    రూ. 65లక్షలు
వేలి ముద్రల ద్వారా      33 కేసులు    రూ. 40లక్షలు 
ఎఫ్‌ఆర్‌ఎస్‌ సిస్టం        10 కేసులు    రూ. 3.70లక్షలు

ఛేదించిన కేసుల వివరాలు
సీసీ కెమెరాల ద్వారా    85 కేసులు 
వేలి ముద్రల ద్వారా     33 కేసులు 
ఎఫ్‌ఆర్‌ఎస్‌ సిస్టం       10 కేసులు 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top