ఇద్దరి ఉసురు తీసిన రూ.40 వేలు

Two Men Died At Nalgonda Because Of Debt - Sakshi

కొండమల్లేపల్లి (దేవరకొండ): రూ.40 వేల వ్యవహారం ఇద్దరి ఉసురు తీసింది. ఈ ఘటన ఆదివారం నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి వివరాల ప్రకారం.. భువనగిరికి చెందిన యాదగిరి (52) కొండమల్లేపల్లి పట్టణంలోని దేవరకొండలో రోడ్డు పక్కన చిన్న వ్యాపారం చేస్తూ కుటుంబంతో ఉంటున్నాడు. పట్టణానికి చెందిన నర్ర నారయ్య (54) ఏడాది క్రితం యాదగిరికి రూ.లక్ష అప్పుగా ఇచ్చాడు. వీటిలో యాదగిరి.. నారయ్యకు రూ.60 వేలు తిరిగి ఇచ్చాడు. మిగతా రూ.40 వేల కోసం ఆలస్యం చేస్తుండటంతో ఇటీవల వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విషయం పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్లడంతో వారు పిలిపించి మాట్లాడుతున్నప్పుడు యాదగిరికి బీపీ ఎక్కువై పడిపోయాడు. కుటుంబ సభ్యులు చికిత్స కోసం యాదగిరిని నల్లగొండకు తీసుకొచ్చారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతిచెందాడు. యాదగిరి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు నారయ్య ఇంటి ముందు ఉంచి ఆందోళనకు దిగారు. దీంతో మనస్తాపానికి గురైన నారయ్య తన భార్య మణెమ్మతో కలసి చింతపల్లి మండలం గడియగౌరారంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ మూత్ర విసర్జనకు బయటికి వెళ్లిన నారయ్య పురుగుల మందు తాగాడు. చికిత్స కోసం దేవరకొండకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top