ఆఖరి పరీక్ష రాయలేక పోయాడు | Tenth Class Student Injured In Road Accident | Sakshi
Sakshi News home page

ఆఖరి పరీక్ష రాయలేక పోయాడు

Mar 28 2018 1:12 PM | Updated on Aug 30 2018 4:20 PM

Tenth Class Student Injured In Road Accident - Sakshi

చికిత్స పొందుతున్న విద్యార్థి శ్రీరామ్‌

పెద్దాపురం: పదో తరగతి పరీక్షలు రాసేందుకు వెళుతున్న విద్యార్థి ప్రమాదబారినపడి ఆఖరి పరీక్ష రాయలేకపోయాడు. వివరాల్లోకి వెళితే.. పెద్దాపురం  పట్టణంలోని కట్టమూరు పుంతకు చెందిన బొంగు శ్రీరామ్‌ (16) స్థానిక సాగర్‌ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం పబ్లిక్‌ పరీక్షల నేపధ్యంలో పద్మనాభ కాలనీ మున్సిపల్‌ బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్ష రాస్తున్నాడు. ఆఖరి పరీక్ష సోషల్‌ ఎగ్జామ్‌ రాసేందుకు మంగళవారం ఇంటి వద్ద నుంచి బైక్‌పై బయల్దేరి పెట్రోలు కొట్టించుకునేందుకు వచ్చి తిరిగి ఎగ్జామ్‌ సెంటర్‌ వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో స్థానిక లలితా థియేటర్‌ కాంప్లెక్స్‌ వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న ఓ ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన ఏపీ05టీడీ 3373 బస్సు బలంగా ఢీ కొట్టి వేగంగా వెళ్లిపోయింది. దీనిని గమనించిన స్థానికులు బస్సు నంబరును నమోదు చేసి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అప్పటికే శ్రీరామ్‌ తీవ్ర గాయాలపాలై స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రాథమిక చికిత్స అనంతరం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement