స్నేహానికి గుర్తుగా ప్రాణం ఇస్తున్నా! | Sakshi
Sakshi News home page

స్నేహానికి గుర్తుగా ప్రాణం ఇస్తున్నా!

Published Thu, Nov 7 2019 5:25 AM

Student suicide in Tirupati - Sakshi

యూనివర్సిటీ క్యాంపస్‌(తిరుపతి): స్నేహితుడు తనను విస్మరించడాన్ని భరించలేకపోతున్నానని, ఆ స్నేహితుడికి గుర్తుగా తన ప్రాణాన్ని ఇస్తున్నానంటూ సూసైడ్‌ నోట్‌ రాసి తిరుపతిలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీగోవిందరాజస్వామి ఆర్ట్స్‌ కళాశాలలో బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్న వేణుగోపాల్‌ కళాశాల అనుబంధ వసతి గృహంలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో బాత్రూంకు వెళ్లాడు. అనంతరం పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. బాధ భరించలేక కేకలు వేయడంతో వసతి గృహంలోని విద్యార్థులు 108కు సమాచారం అందించారు.

తీవ్రంగా కాలిపోయిన వేణుగోపాల్‌ను రుయా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి స్వగ్రామం అనంతపురం జిల్లా పుట్లూరు మండలం మట్టిపల్లె గ్రామం. మొదటి రెండేళ్లు హాస్టల్లో ఉంటూ చదివాడు. ఎన్‌సీసీలో చురుగ్గా పాల్గొనేవాడు. కొన్ని కారణాలతో ఈ ఏడాది హాస్టల్‌ ఖాళీ చేసి బయట రూం తీసుకుని ఉంటున్నాడు.

ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో స్నేహితులతో విభేదాలు, తన మానసిక సంఘర్షణను వివరించారు. ‘తొందరపాటులో చేసిన చిన్న తప్పు వల్ల నా స్నేహితుడు నన్ను పూర్తిగా విస్మరించాడు. మూడు నెలలుగా నరకయాతన అనుభవించాను. నన్ను క్షమించు. మన స్నేహానికి గుర్తుగా నా ప్రాణం ఇస్తున్నాను’ అంటూ అందులో పేర్కొన్నాడు. ఈ సంఘటనపై కేసు నమోదు విచారణ చేపట్టినట్లు ఈస్ట్‌ సీఐ బి.శివప్రసాద్‌రెడ్డి తెలిపారు.  

Advertisement
Advertisement