శ్రీవిద్య అరెస్టు.. నవ్వు ముఖంతో పోలీసుల మధ్య‌.. | srividya.. who was killed husband arrested | Sakshi
Sakshi News home page

శ్రీవిద్య అరెస్టు.. నవ్వు ముఖంతో పోలీసుల మధ్య‌..

Jan 6 2018 5:52 PM | Updated on Aug 24 2018 2:36 PM

srividya.. who was killed husband arrested - Sakshi

సాక్షి, గుంటూరు : ప్రేమగా మద్యం పోసి అందులో ప్రియుడి సాయంతో సైనెడ్‌ కలిపి భర్తను చంపిన శ్రీవిద్య అరెస్టయింది. భర్తను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి పరారీ అయిన ఆమెను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. గుంటూరు జిల్లాకు చెందిన శ్రీవిద్య అనే మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాదెండ్ల మండలం పునుగుపాడు గ్రామానికి చెందిన నల్లబోతు నరేంద్ర(27), శ్రీవిద్య అనే ఇద్దరు భార్యభర్తలు. శ్రీవిద్య గత కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. తన అక్రమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని భావించి తన ప్రియుడితో కలిసి కుట్ర చేసింది.


ఎవరికి అనుమానం రాకుండా మద్యంలో సైనెడ్‌ కలిపి తాగించింది. అనుమానం రాకుండా ఆత్మహత్యగా చిత్రించింది. అందుకుగాను చనిపోయిన భర్త మృతదేహాన్ని తీసుకెళ్లి పునుగుపాడువద్ద ఉన్న కాలువలో పడేసింది. ఈ సంఘటన గత నెల డిసెంబర్‌ (2017) 19న చోటుచేసుకుంది. అయితే, తల్లిదండ్రుల అనుమానం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీవిద్య అతడి ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్‌ ప్రకారమే హత్య చేసినట్లు గుర్తించారు.

శుక్రవారం గొట్టిపాటి వీరయ్య చౌదరి, గుంజి బాలరాజు, పూజల చౌడయ్య అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టగా శ్రీవిద్య మాత్రం పరారీలో ఉంది. అయితే, ఎట్టకేలకు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ సమయంలో తన భర్తను హత్య చేసినందుకు ఆమె మొఖంలో ఎలాంటి పశ్చాత్తాప ఛాయలు కనిపించలేదు. పైగా నవ్వుతూ మీడియా ఎదుటకు వచ్చి అందరినీ షాకయ్యేలా చేసింది. కాగా, ప్రియులతో సంబంధాలు పెట్టుకొని తమ భర్తలను స్వాతి, జ్యోతి అనే గృహిణులు హత్య చేసిన సంఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement