కన్నతండ్రిని కత్తులతో నరికిన కసాయి కొడుకులు

Sons Kill Father in Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు(డోన్‌): తల్లిని కొట్టారన్న కోపంతో తండ్రిని కుమారులే హతమార్చారు. ఈ సంఘటన సోమవారం రాత్రి డోన్‌ పట్టణంలోని గుత్తి రోడ్డులో గల అమ్మా హోటల్‌ ఎదుట చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని చిగురుమాను పేట ప్రాంతానికి చెందిన కృపానందం (45)కు పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉండేవి. అలాగే భార్యను తరచూ వేధించేవాడు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం భార్యను కొట్టాడు. ఇందుకు అతని కుమారులైన రౌడీషీటర్లు చిన్నకాంతు, పెద్దకాంతు, నాగన్న ఆగ్రహించారు. 

అమ్మా హోటల్‌ ఎదుట ఉన్న కృపానందంను చుర కత్తులతో విచక్షణారహితంగా నరికారు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆటోడ్రైవర్లు చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రభుత్వాసుపత్రికి చేరుకొని ఘటన గురించి కృపానందంను అడిగి తెలుసుకొన్నారు. తన భార్యను కొట్టినందుకు  కుమారులే కత్తులతో దాడిచేశారని అతను ఫిర్యాదు చేశాడు. ప్రాథమిక చికిత్స అనంతరం అతన్ని మెరుగైన వైద్యచికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు  ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.  
హత్యకు గురైన కృపానందం   
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top