శిల్పాశెట్టి భర్తకు ఈడీ మరోసారి షాక్‌ | Shilpa Shetty Husband Raj Kundra Summoned In Money Laundering Case | Sakshi
Sakshi News home page

శిల్పాశెట్టి భర్తకు ఈడీ మరోసారి షాక్‌

Oct 29 2019 1:19 PM | Updated on Oct 29 2019 1:39 PM

Shilpa Shetty Husband Raj Kundra Summoned In Money Laundering Case - Sakshi

సాక్షి, ముంబై : ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు మనీ లాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. 2013లో చనిపోయిన గ్యాంగ్‌స్టర్ ఇక్బాల్‌కు మిర్చికి సంబంథించిన కేసులో రాజ్ కుంద్రాపై ఆరోపణలున్న సంగతి తెలిసిందే.  ఈ కేసులో రాజ్ కుంద్రాను విచారించేందుకు ఈడీ రంగం సిద్ధం చేసింది.

ఆర్థిక నేరాలపై దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ, ఈ కేసుకు సంబంధించి రంజీత్ బింద్రా , బాస్టియన్ హాస్పిటాలిటీ అనే సంస్థతో కుంద్రాకున్న లావాదేవీలను పరిశీలిస్తోంది.  ఇటీవల వీరిద్దరి మధ్య కొన్ని వ్యాపార లావాదేవీలపై కీలక సమాచారం అందిన నేపథ్యంలో సమన్లు ​​ జారీ చేసినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో రాజ్ కుంద్రా స్టేట్ మెంట్ ను రికార్డు చేయాల్సి వున్నందున ముంబైలోని విచారణ అధికారుల ముందు హాజరు కావాలని  నోటిసులిచ్చినట్టు  తెలిపారు. బాస్టియన్ హాస్పిటాలిటీ సంస్థతో రంజీత్‌ బింద్రాకు ప్రమేయం ఉందని, రజనీత్ తో కుంద్రా దగ్గరి సంబంధాలను నెరిపాడని అధికారులు అంటున్నారు.  ముంబైలో విలువైన ఆస్తుల అమ్మకాలు, కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగినట్టు ఈడీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో మిర్చిపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత 2013లో గుండెపోటుతో మిర్చి మరణించాడు.   పలు ఆర్థిక అవకతవకల నేపథ్యంలో రంజిత్ బింద్రాను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలను రాజ్ కుంద్రా ఖండించారు

కాగా  ఇటీవల ( సెప్టెంబర్ 9 ) 44 ఏళ్ళు నిండిన భర్త రాజ్ కుంద్రా పుట్టినరోజు వేడుకలను  శిల్పా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను , వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement