సమత కేసు: ఆధారాలు లేవు | Senior Counsel Raheem To File Petition In Samata Case | Sakshi
Sakshi News home page

సమత కేసు: నిందితులకు వ్యతిరేకంగా ఆధారాలు లేవు

Dec 19 2019 11:01 AM | Updated on Dec 19 2019 3:53 PM

Senior Counsel Raheem To File Petition In Samata Case - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: సంచలనం రేపిన సమత అత్యాచారం, హత్య కేసు విచారణ ఆదిలాబాద్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో శరవేగంగా సాగుతోంది. నాలుగు రోజు గురువారం ఈ కేసులోని ముగ్గురు నిందితుల వాంగ్మూలాన్ని కోర్టు  స్వీకరించనుంది. సోమవారం నుంచి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు గురువారం మరోసారి నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. ఇక, ఈ కేసులో నిందితుల తరఫున వాదించేందుకు సీనియర్‌ న్యాయవాది రహీంను నియమించారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును వాదించేందుకు ఆయన అంగీకరించిన సంగతి తెలిసిందే. రహీం గురువారం నుంచి నిందితుల తరఫున కోర్టులో వాదనలు వినిపించనున్నారు.

ఈ కేసులో తమకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని, మెడికల్ ఎవిడెన్స్ కూడా లేనందున తమపై కేసును డిశ్చార్జ్ చేయవలసిందిగా నిందితుల తరఫున పిటిషన్ వేయనున్నట్లు లాయర్‌ రహీం తెలిపారు. ఇక, నేటినుంచే కేసు కోర్టులో ట్రయల్‌కు వచ్చే అవకాశం ఉందని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రమణారెడ్డి తెలిపారు. ఈ ఘటనలో 44 మంది సాక్షులతో కూడిన చార్జిషీట్‌ను అసిఫాబాద్‌ జిల్లా ఎస్పీ మల్లారెడ్డి శనివారం దాఖలు చేసిన విషయం తెలిసిందే. బాధితురాలు దళిత మహిళ కావడంతో అత్యాచారం, హత్య కేసులతో పాటుగా మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేయనున్నట్లు అభిప్రాయపడుతున్నారు.

కాగా చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ.. నవంబరు 24న కుమురం భీం జిల్లా లింగాపూర్‌ మండలం ఎల్లాపటార్‌లో అత్యాచారం, హత్యకు గురై న విషయం తెలిసిందే. బాధితురాలిని చిత్రహింసలకు గురిచేసి అత్యంత పాశవికంగా హతమార్చిన నిందితులను అదే నెల27న పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో బాధితురాలి పేరును ‘సమత’గా మార్చిన పోలీసులు.. నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాక.. గొంతుకోసి చంపారని కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఫోరెన్సిక్‌ పరీక్షల్లో ఈ విషయం తేలిందన్నారు. అలాగే బాధితురాలి శరీరంలో నిందితుల డీఎన్‌ఏ లభించిన నివేదికను కోర్టుకు సమర్పించారు.

ఇక దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ ఘటనకు మూడు రోజుల ముందు ఈ దారుణం జరిగింది. అయితే దిశ తరహాలో మొదట ప్రాధాన్యత దక్కకపోవడంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. తర్వాత ప్రభుత్వం స్పందించి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో నిందితులు ఏ1గా షేక్‌బాబా, ఏ2 షేక్‌ షాబొద్దీన్‌, ఏ3 షేక్‌ ముఖ్దూమ్‌లకు ఉరిశిక్ష విధించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
చదవండి: ‘సమత’ కేసు నిందితుల తరఫు న్యాయవాది రహీం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement