బాలికపై లైంగికదాడికి ప్రిన్సిపాల్‌ యత్నం | School Principal Molestation on Girl Child in Hyderabad | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగికదాడికి ప్రిన్సిపాల్‌ యత్నం

Nov 1 2019 6:42 AM | Updated on Nov 1 2019 6:42 AM

School Principal Molestation on Girl Child in Hyderabad - Sakshi

అసద్‌బాబానగర్‌లోని మోషియన్‌ పాఠశాల, నిందితుడు ఇంతిజార్‌ అలీ

బహదూర్‌పురా: ఓ బాలికపై సాక్షాత్తు పాఠశాల ప్రిన్సిపాల్‌ లైంగికదాడికి యత్నించిన సంఘటన బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ దుర్గా ప్రసాద్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కిషన్‌బాగ్‌ అసద్‌బాబానగర్‌లో ఇంతిజార్‌ అలీ అనే వ్యక్తి మోషియన్‌ పేరుతో ప్రీ ప్రైమరీ స్కూల్‌ నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన బాలిక (11) సదరు స్కూల్‌లో మూడో తరగతి చదువుతోంది. ఆర్థిక సమస్యల నేపథ్యంలో సదరు బాలిక తల్లిదండ్రులు స్కూల్‌ ఫీజు చెల్లించలేకపోయారు. బాలికను పరీక్షకు అనుమతించాలని తల్లిదండ్రులు కోరడంతో ఆధార్‌ కార్డు, ఇతర పత్రాలు తీసుకొస్తే పరీక్ష రాయిస్తానంటూ ప్రిన్సిపాల్‌ ఇంతిజార్‌ అలీ చెప్పాడు. దీంతో బుధవారం తల్లిదండ్రులు బాలికను తీసుకొని పాఠశాలకు వచ్చారు. స్కూల్‌లో కంప్యూటర్‌ పని చేయడం లేదని బాలిక తల్లిదండ్రులను ఇంటికి పంపిన ప్రిన్సిపాల్‌ బాలికను స్కూల్‌లోనే ఉంచుకున్నాడు. సాయంత్రం ఆధార్‌కార్డును పరిశీలిస్తున్నట్లు నటిస్తూ ఆమెపై లైంగికదాడికి యత్నించాడు. బాధితురాలు ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వారు గురువారం బహదూర్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రిన్సిపాల్‌ ఇంతిజార్‌ అలీని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఎస్సై నర్సింహ రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు. 

మండల డిప్యూటీ ఈవో విచారణ
దీనిపై సమాచారం అందడంతో బహదూర్‌పురా మండల డిప్యూటీ ఈవో వేణుగోపాల చారి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలకు వెళ్లి విద్యార్థులను విచారించారు. స్కూల్‌ ప్రిన్సిపాల్‌పై కేసులు నమోదు చేశారని, అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  మైనర్‌ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన పాఠశాల ప్రిన్సిపాల్‌ను అరెస్ట్‌ చేసి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షులు అచ్యుతారావు డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement