సిటీలోనే సింహభాగం!

Rs 24 crore above cash seized across the state - Sakshi

కోడ్‌ అమలులోకి వచ్చిన నాటి నుంచీ తనిఖీలు 

రాష్ట్ర వ్యాప్తంగా రూ.24.23 కోట్ల నగదు స్వాధీనం 

ఒక్క హైదరాబాద్‌లో పట్టుకుందే రూ.15 కోట్లు

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన నాటి నుంచి తనిఖీలు, సోదాలు ముమ్మరం చేసిన సిటీ పోలీసులు రికార్డు స్థాయి ఫలితాలు సాధించారు. ఆదివారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా స్వాధీనమైన సొమ్ము లో 61.9 శాతం సిటీలోనే దొరికింది. బంగారం, వెండి, ఇతర వస్తువులు సీజ్‌ చేయడంలోనూ ఇదే ధోరణి కొనసాగింది. షెడ్యూల్‌ వెలువడిన నాటి నుంచి సిటీ పోలీసులు నగదు తరలింపుపై డేగకన్ను వేశారు.

ఆది నుంచి పటిష్టచర్యలు
పోలింగ్‌ స్వేచ్ఛాయుతంగా జరగాలంటే నగదు అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఎన్నికల సంఘం అనునిత్యం స్పష్టం చేస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసులు నగదు తరలింపుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఓ పక్క సాధారణ పోలీసులతోపాటు టాస్క్‌ఫోర్స్‌ బృందాలు దీనిపై కన్నేసి ఉంచాయి.  ఆదివారం సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.24.23 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ కార్యాలయం ప్రకటించింది. వీటిలో సిటీ పోలీసు విభాగానికి చిక్కిందే రూ.15 కోట్లకు పైగా ఉంది. శని, ఆదివారాల్లోనే టాస్క్‌ఫోర్స్, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు ఎనిమిది ఉదంతాల్లో రూ.4.9 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.  

ఇతరాల్లోనూ పెద్ద ‘స్థానమే’... 
కేవలం నగదు మాత్రమే కాకుండా ఓటర్లను ప్రలోభాలకు లోను చేయడానికి వినియోగిస్తారనే అనుమానం ఉన్న ప్రతి రవాణాపైనా సిటీ పోలీసులు కన్నేసి ఉంచారు. సరైన బిల్లులు లేకుండా తరలిస్తున్న వెండి, బంగారం, ఆభరణాలతో పాటు నిషేధిత పదార్థాలైన గంజాయి, గుట్కా తదితరాల స్మగ్లింగ్‌ను అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహాకు చెందిన రూ.3.31 కోట్ల విలువైనవి సీజ్‌ అయ్యాయి.  సిటీ చుట్టూ ఉన్న సైబరాబాద్, రాచకొండల్లోనూ రూ.కోట్లలోనే స్వాధీనం చేసుకున్నారు. కొన్ని మినహాయింపులు ఇచ్చిన నేపథ్యంలో లైసెన్స్‌డ్‌ ఆయుధాల డిపాజిట్‌ తగ్గింది. 

ఏపీ లింకు రవాణా సైతం... 
ఈసారి తెలంగాణలో పార్లమెంట్, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ–పార్లమెంట్‌ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నగరంలో, నగరం మీదుగా నగదు అక్రమ రవాణా భారీగా పెరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన అనేక మంది కీలక నాయకులకు హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు, వ్యాపారాలు ఉన్నా యి. వీరంతా ఎన్నికలతో పాటు కొన్ని కీలకమైన సందర్భాల్లో తమ నేతల్ని ‘ఆర్థికంగా ఆదుకుంటున్నారు’. ప్రలోభాలు, లంచాలకు అవసరమైన సొమ్మును తమ వ్యాపారాల ముసుగులో తరలించి వారికి అప్పగిస్తు న్నారు.

కొందరు దొంగ లెక్కలు చూపిస్తూ తీసుకువెళ్తుండగా మరికొందరు ఎలాంటి లెక్కలు లేకుండా తమ అనుచరులు, నమ్మినబంట్ల ద్వారా చేరాల్సిన చోటుకు చేర్చేస్తున్నా రు. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న కొందరు హవాలా వ్యాపారుల్నీ టీడీపీ వాడుకుంటోంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడ కు డబ్బు పంపాల్సి ఉన్నా దేశభద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని తెలిసీ హవాలా మార్గాన్ని ఆశ్రయిస్తోంది. ఆ పార్టీ నేతలు ఈ నగదు సరఫరాల్లో కీలక దళారు లుగా వ్యవహరిస్తున్నారు.  నగరంలో పట్టుబడిన డబ్బుకు ఏపీ ఎన్నికలతో లింకుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనూ కేసుల్ని దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top