క్లినిక్కు వెళుతూ...
లారీ ఢీకొని ఆర్ఎంపీ వైద్యుడు మృతి
బెజ్జిపురం జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదన
లావేరు: జాతీయ రహదారిపై బెజ్జిపురం జంక్షన్ వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొని రణస్థలం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు మావుడూరు వేణు(58) మృతి చెందాడు. బెజ్జిపురం గ్రామంలో ఉన్న క్లినిక్కు వెళ్లేందుకు ద్విచక్రవాహనంతో ఇతడు జాతీయ రహదారిని దాటుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. లారీ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలిసింది. ఘటనకు సంబంధించి లావేరు పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. లావేరు మండలంలోని బెజ్జిపురం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు మావుడూరు వేణు అనే వ్యక్తి 15 సంవత్సరాలు క్రితమే రణస్థలం గ్రామానికి వెళ్లిపోయి అక్కడ నివాసం ఉంటున్నాడు. బెజ్జిపురం గ్రామంలో క్లినిక్ పెట్టుకున్నాడు. రోజూ రణస్థలం నుంచి బెజ్జిపురం గ్రామంలోని క్లినిక్కు వచ్చి వెళుతున్నాడు.
అదేవిధంగా శనివారం ఉదయం కూడా వేణు తన ద్విచక్రవాహనంతో క్లినిక్కు వస్తుండగా బెజ్జిపురం జంక్షన్ వద్ద జాతీయ రహదారిని దాటుతుండగా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన లారీ ఇతడిని బలంగా ఢీకొని కొంతదూరం ఈడ్చుకువెళ్లింది. తలకు బలమైన దెబ్బ తగిలి సంఘటనా స్థలంలోనే వేణు మృతి చెందాడు. బైక్ ఎక్కడికక్కడ విరిగిపోయింది. డ్రైవర్ అతివేగంగా లారీని నడపటం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ప్రమాదం కారణంగా వాహనాల రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. ప్రమాద విషయం తెలుసుకున్న లావేరు పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి జాతీయ రహదారిపై అడ్డంగా ఉన్న లారీని పక్కకు తీసివేయించి వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. ప్రమాద వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. లావేరు ఎస్ఐ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కన్నీరుమున్నీరైన భార్య, పిల్లలు
ఆర్ఎంపీ వైద్యుడు వేణు మృతి చెందడంతో అతని భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే రణస్థలం, బెజ్జిపురం గ్రామాల్లో ఉన్న మృతుడు కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహం వద్ద బోరున విలపించారు. బెజ్జిపురం గ్రామస్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి ఆర్ఎంపీ వైద్యుడు మృతదేహాన్ని చూసి కంటతడి పెట్టారు.