లిక్కర్‌ చాక్లెట్ల స్మగ్లింగ్‌ అడ్డాగా అబిడ్స్‌

Raid On Liquor Chocolate Mafia In Abids - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఢిల్లీ కేంద్రంగా నగరంలోని బేగం బజార్, అబిడ్స్‌లో లిక్కర్ చాక్లెట్ల స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముఠా కార్యకలాపాలను ఎక్సైజ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఛేదించారు. ఆయా స్థావరాలపై దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో లిక్కర్‌ చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న షాప్ యజమానులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అబిడ్స్‌లోని కమల్ వాచ్స్&గిఫ్ట్స్ కంపెనీ షోరూం, బేగంబజార్‌, సిద్దంబర్ బజార్‌లోని హీరా కాంప్లెక్స్‌ చాక్లెట్ డిస్టిబ్యూటర్ కంపెనీపై దాడులు చేసినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు.

లక్షల విలువ చేసే లిక్కర్‌ చాక్లెట్లు..
పలు బ్రాండ్ల పేరుతో లిక్కర్ చాక్లెట్‌ అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించామని ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులు, ఐటీ నిపుణులు, పాఠశాల విద్యార్థులకు వీటిని సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. మొత్తంగా 1081 బాక్స్‌లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. విదేశీ మాదక ద్రవ్యంలో వీటి విలువ లక్షల్లో ఉంటుందని పేర్కొన్నారు. ప్రాధమికంగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని... వారిచ్చిన సమాచారం మేరకు కేసు దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తెలిపారు. కాగా లిక్కర్ చాక్లెట్లకు సంబంధించిన ముఠా బేగం బజార్, అబిడ్స్ కేంద్రంగా పనిచేస్తున్నట్లు పోలీస్ విచారణలో తేలింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top