మ్యూజియంపై పట్టున్నవారి పనేనా! | Police Conducting internal investigation on Nizam museum case | Sakshi
Sakshi News home page

మ్యూజియంపై పట్టు ఉన్నవారి పనేనా!

Sep 4 2018 5:52 PM | Updated on Sep 4 2018 8:18 PM

Police Conducting internal investigation on Nizam museum case - Sakshi

మ్యూజియం మీద పట్టు ఉన్న వ్యక్తులే పక్కా ప్రణాళిక ప్రకారం దొంగతనం చేసినట్లగా పోలీసులు అనుమానిస్తున్నారు.

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని హిజ్‌ ఎక్సాల్టెడ్‌ హైనెస్‌(హెచ్‌ఈహెచ్‌) నిజాం మ్యూజియంలో దొంగతనాన్ని చాలెంజ్ గా తీసుకున్న పోలీసులు 10 టాస్క్ ఫోర్స్ బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మ్యూజియం మీద పట్టు ఉన్న వ్యక్తులే పక్కా ప్రణాళిక ప్రకారం దొంగతనం చేసినట్లగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో స్టార్ సెక్యూరిటీ ద్వారా మ్యూజియంలో గతంలో సెక్యూరిటీగా పని చేసిన వారిని పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న గ్రూప్ 9 సెక్యూరిటీని కూడా విచారిస్తున్నారు.

నిజాం మ్యూజియంలో ఆదివారం రాత్రి  అత్యంత విలువైన డైమండ్, బంగారు, వెండి వస్తువులు చోరీకి గురైన విషయం తెలిసిందే. మ్యూజియంలోని మూడు గ్యాలరీల్లో నిజాం పాలకులు వాడిన డైమండ్, బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులున్నాయి. ప్రతిరోజు మాదిరిగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు మ్యూజియాన్ని సిబ్బంది మూసివేశారు. రాత్రి విధి నిర్వహణలో ఉన్న ఐదుగురు సెక్యూరిటీ గార్డులు గ్యాలరీలకు తాళాలు వేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు మ్యూజియాన్ని తెరిచి చూడగా దొంగతనం వెలుగు చూసింది. రెండో గ్యాలరీలో ఉన్న డైమండ్‌ టిఫిన్‌ బాక్స్, బంగారు టీ కప్పు, సాసర్, స్పూన్‌లు కనిపించలేదు.

మ్యూజియం వెనుకాల ఉన్న వెంటిలేటర్లను విరగ్గొట్టి లోనికి వచ్చిన దొంగలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీమ్‌లు మ్యూజియాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలను సేకరించాయి. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. మ్యూజియాన్ని సోమవారం మధ్యాహ్నం నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ సందర్శించారు. చోరీ జరిగిన తీరుపై సిబ్బందిని ఆరా తీశారు. మ్యూజియానికి సంబంధించి తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై పోలీసులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement