గౌతమి మరణం వెనుక మిస్టరీలెన్నో?

Mystery In Gouthami Suicide Case Prakasam - Sakshi

చీరాల: నాలుగేళ్ల క్రితమే వివాహమైన గౌతమి (27) రామాపురం వద్ద తీరంలో మునిగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తల్లిదండ్రుల ఆరోపణలు సైతం తమ కుమార్తెది ముమ్మాటికీ హత్యేనని ఆరోపిస్తున్నారు. చీరాలకు చెందిన గౌతమి గురువారం సముద్రంలో మునిగి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. పోలీసులు కూడా ఈ ఘటనపై అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. 7నెలలుగా భర్త కోటా వెంకటరామకృస్ణ మణికంఠ పవన్‌కుమార్, గౌతమి మధ్య విభేదాలు ఉన్నాయి. కట్నం విషయంలో కూడా వీరి మధ్య మనస్పర్ధలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంట్లో భార్యభర్తల మధ్య జరుగుతున్న వివాదాలను గౌతమి తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది.

ఇది ఇలా ఉంటే ఎంజీసీ మార్కెట్‌లో వస్త్రదుకాణం మూసేసి ఇంటికి వచ్చిన పవన్‌కుమార్‌ తెల్లవారే సరికి తమ భార్య లేకపోవటంతో గమనించి ఆమె రామాపురం బీచ్‌లో వికటజీవిగా పడి ఉందని సమాచారం తెలుసుకుని వెళ్లడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రాత్రి వేళ లేదా తెల్లవారు జామున గౌతమి ఒంటరిగా రామాపురం బీచ్‌కు వెళ్లి సముద్రంలో మునిగి ఆత్మహత్యకు పాల్పడటం వెనుక ఎన్నో అనుమానాలు ఉన్నాయి. సముద్రంలో మునిగి అదే ప్రాంతంలో కొట్టుకురావడం అసాధ్యం. అలలు, గాలి తాకిడికి ఒకచోట మునిగితే శవమైన తర్వాత మరో ప్రాంతంలో శవం ఒడ్డుకు కొట్టుకొస్తుంది.  గౌతమి మృతదేహం మాత్రం మునిగిన ప్రాంతంలోనే శవమై కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top