వివాహేతర సంబంధం; ముక్కలుగా నరికి....

MP Doctor Allegedly Murdered Driver And Chops His Body - Sakshi

భోపాల్‌ : తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని నిలదీసిన డ్రైవర్‌ను అత్యంత పాశవికంగా హతమార్చాడో ప్రభుత్వ వైద్యుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

వివరాలు... సునీల్‌ మంత్రి(56) ప్రభుత్వాసుపత్రిలో ఆర్థోపెడిక్‌ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతడి భార్య బొటిక్‌ నడిపేది. అయితే గత కొన్ని రోజుల క్రితం ఆమె చనిపోవడంతో.. ఆమె వద్ద పనిచేసే ఓ వివాహిత బొటిక్‌ బాధ్యతలు తీసుకుంది. ఈ క్రమంలో సునీల్‌ మంత్రి ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం సదరు మహిళ భర్త వీరేంద్ర పచౌరీకి తెలియడంతో అతడిని తన వద్ద డ్రైవర్‌గా నియమించుకున్నాడు. ఎక్కువ జీతం ఆశ చూపినప్పటికీ లొంగని వీరేంద్ర తన భార్యతో సంబంధం కొనసాగిస్తే పరువు తీస్తానని సునీల్‌ను బెదిరించేవాడు. ఈ క్రమంలో అతడి అడ్డు తొలగించాలని భావించిన సునీల్‌ సోమవారం రాత్రి వీరేంద్రను హత్య చేశాడు.

ముక్కలుగా నరికి..యాసిడ్‌లో కరిగించాడు
వీరేంద్రను హత్య చేసిన అనంతరం ఆధారాలు దొరకకుండా చేసేందుకు.. సునీల్‌ అతడి శవాన్ని 500 ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత కొన్నింటిని యాసిడ్‌లో కరిగించాడు. అయితే సునీల్‌ ప్రవర్తనపై అనుమానం రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఓ డ్రమ్‌లో యాసిడ్‌.. పక్కనే పాక్షికంగా కాలిన మనిషి శరీర భాగాలను గుర్తించారు. దీంతో సునీల్‌ను అరెస్టు చేసి విచారించగా అతడు నేరం అంగీకరించాడని ఎస్పీ అరవింద్‌ సక్సేనా తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top