స్నేహితుడితో కలిసి భార్యపై లైంగికదాడి

Molestation on a wife with a friend - Sakshi

అట్ల కాడతో మర్మాంగాలు కాల్చి పైశాచికత్వం

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వికృత ఘటన

కదిరి అర్బన్‌: కట్టుకున్న భార్య కాళ్లు, చేతులు కట్టేసి.. స్నేహితుడితో కలిసి అత్యాచారం చేశాడో భర్త. అంతటితో ఆగకుండా అట్ల కాడను కాల్చి ఆమె మర్మాంగాలపై వాతలు పెట్టాడు. అనంతపురం జిల్లా కదిరి మండలంలోని సోమేష్‌ నగర్‌లో మంగళవారం ఈ ఘటన వెలుగు చూసింది. రూరల్‌ సీఐ నిరంజన్‌రెడ్డి కథనం ప్రకారం.. తలుపుల మండలం సిద్దిగూరుపల్లికి చెందిన 30 ఏళ్ల మహిళకు నాలుగేళ్ల క్రితం సోమేష్‌ నగర్‌కు చెందిన మల్లేశ్వర్‌తో వివాహమైంది. దంపతులిద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. మల్లేశ్వర్‌ తన భార్యపై అనుమానం పెంచుకుని వేధించసాగాడు. నవంబర్‌ 29న మద్యం తాగి స్నేహితుడు కుమార్‌తో కలిసి ఇంటికి వచ్చిన మల్లేశ్వర్‌ భార్య కాళ్లు, చేతులను మంచానికి కట్టేసి స్నేహితుడు కుమార్‌తో కలిసి అత్యాచారానికి తెగబడ్డాడు.

ఆ తర్వాత అట్ల కాడ కాల్చి ఆమె మర్మాంగాలపై వాతలు పెట్టాడు. ఘటన అనంతరం బాధితురాలు పుట్టింటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు బిడ్డను తీసుకుని తలుపుల పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లగా.. అత్యాచారం జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదని.. కదిరి రూరల్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తలుపుల పోలీసులు సూచించారు. దీంతో బాధితురాలు మంగళవారం కదిరి రూరల్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలిని కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. భర్త, అతని స్నేహితుడిపై ఐపీసీ 342, 376, 109, రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమెదు చేశారు. ఈ అకృత్యానికి పాల్పడిన ఇద్దరూ పరారీలో ఉన్నారు. కాగా నిందితుడు మల్లేశ్వర్‌ గతంలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి... జైలు శిక్ష అనుభవించినట్లు పోలీసులు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top