అదృశ్యమైన మహిళ అనుమానాస్పద మృతి

Married Women Suspicious death in Hyderabad - Sakshi

పోలీసుల అదుపులో మృతురాలి భర్త

మియాపూర్‌: మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఓ మహిళ ఇంట్లోని సంపులో శవమై తేలింది. భర్తే ఆమెను హత్య చేసి ఉంటాడని మృతురాలి సోదరుడు ఆరోపిస్తున్నాడు. మియాపూర్‌ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మియాపూర్‌ ఏసీపీ రవికుమార్, సీఐ వెంకటేష్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పరిగి మండలం, నస్కల్‌ ప్రాంతానికి చెందిన తాజోద్దీన్‌ కుటుంబం నగరానికి వలస వచ్చి హఫీజ్‌పేట్‌ సాయినగర్‌లో నివాసముంటూ స్థానికంగా కిరాణం షాపు నిర్వహిస్తున్నారు. తాజోద్దీన్‌ ఎనిమిదేళ్ల క్రితం జగద్గిరిగుట్ట అంబేద్కర్‌నగర్‌కు చెందిన షాజియాబేగం(27)ను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమారులు. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 21న షాజియాబేగం అదృశ్యం కావడంతో ఆమె భర్త తాజోద్దీన్‌  మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి తాజోద్దీన్‌ ఇంట్లో తనిఖీ చేయగా ఇంటి ఆవరణలోని సంపులో షాజియాబేగం మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాం«ధీ ఆస్పత్రికి తరలించారు.

సాయినగర్‌లో ఉద్రిక్తత...
షాజియాబేగం అదృశ్యంపై ఆమె పుట్టింటి వారు భర్త, అత్త మామలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాత్రి సంపులో మృతదేహం లభ్యమైనట్లు సమాచారం అందడంతో ఆమె తరపు బంధువులు తాజోద్దీన్‌ ఇంటిపై దాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం  అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top