నేను ఇక్కడ ఉండలేను.. | maried woman suspecty dead | Sakshi
Sakshi News home page

పిల్లలు పుట్టలేదని..

Nov 6 2017 7:06 AM | Updated on Nov 6 2017 1:33 PM

maried woman suspecty dead - Sakshi

సుహాసిని (ఫైల్‌)

‘అమ్మా..! నన్ను ఇక్కడ చిత్రహింసలకు గురి చేస్తున్నారు... పిల్లలు పుట్టలేదని నా భర్తకు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నారు.. నేను ఇక్కడ ఉండలేను.. రేపు (ఆదివారం) సాయంత్రం ఊరికి వస్తాను..’ అని కుమార్తె తల్లికి ఫోన్‌ చేసింది.. కుమార్తె వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు కొన్ని గంటల్లోనే.. గుండె పగిలే వార్త వినాల్సి వచ్చింది.. కుమార్తె చనిపోయిందని ఫోన్‌ రావడంతో ఒక్కసారిగా తల్లి సొమ్మసిల్లి పడిపోయింది.

ప్రొద్దుటూరు క్రైం :
మండలంలోని అమృతానగర్‌కు చెందిన కురువ సుహాసిని(23) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అయితే తల్లిదండ్రులు మాత్రం భర్త, అత్తామామలే చంపేసి, మృతదేహాన్ని కాల్చారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన రామకృష్ణ, శ్యామల దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారిలో సుహాసినికి ప్రొద్దుటూరులోని అమృతానగర్‌కు చెందిన మల్లికార్జునతో 3 ఏళ్ల క్రితం వివాహం చేశారు. కట్న కానుకల కింద రూ. 1 లక్ష నగదు, 10 తులాల బంగారం ఇచ్చారు. అతను కారు డ్రైవర్‌. మూడేళ్‌లైనా వారికి సంతానం కలగలేదు. వైద్యులతోపాటు పలు చోట్ల నాటు మందును కూడా ఇద్దరు తీసుకున్నారు. అయినా వారికి సంతానం కలగలేదు.  

కష్టాలు తల్లిదండ్రులకు చెప్పుకొని...
పది రోజుల క్రితం సుహాసిని జేజి చనిపోవడంతో ఆమె కర్నూలుకు వెళ్లింది. ఆ సమయంలో తల్లిదండ్రులు అత్తింటి స్థితిగతుల గురించి అడగడంతో.. అసలే కష్టాల్లో ఉన్న కూతురు వారికి విషయం తెలిసింది. సంతానం కలగలేదని మా బావ (భర్త)కు మరో పెళ్లి చేయాలని అత్తా, మామలు ప్రయత్నం చేస్తున్నారని తల్లితో చెప్పింది. ‘కొన్ని రోజుల నుంచి బావ కూడా నాతో సరిగా మాట్లాడటం లేదు..’ అని కంట తడి పెట్టింది. అదే రోజు రాత్రి ఆమె అమృతానగర్‌కు వచ్చింది. అప్పటి వరకు తమ కూతురి కాపురం బాగుందని వారు భావించారు. అయితే కుమార్తె చెప్పి న మాటలు విని తల్లిదండ్రులు కలత చెందసాగారు. ఈ క్రమంలో సుహాసిని శనివారం తల్లికి ఫోన్‌ చేసింది. తన మనసు బాగా లేదని, ఒక సారి ఊరికి వస్తానని చెప్పింది. ‘ఎప్పుడు వస్తున్నావ్‌..’ అని తల్లి అడుగగా.. ఆదివారం సాయంత్రం అని తెలిపింది. తెల్లారితే కుమార్తె వస్తుందని తల్లిదండ్రులు ఎదురు చూడ సాగారు. అయితే కొన్ని గంటల్లోనే కుమార్తె చనిపోయిందని అల్లుడు మల్లికార్జున ఫోన్‌ చేశాడు.

ఆత్మహత్య చేసుకోలేదు.. చంపేశారు
కుమార్తె చనిపోయిందని ప్రొద్దుటూరు నుంచి ఫోన్‌ రావడంతో ఆమె తల్లిదండ్రులు శనివారం రాత్రి హుటాహుటిన వచ్చేశారు. కుమార్తె మృతదేహాన్ని చూసి బోరున విలపించసాగారు. మృతదేహం పడి ఉన్న తీరును చూసి వారు అనుమానం వ్యక్తం చేశారు. తమ కూతుర్ని చంపి, మృతదేహాన్ని కాల్చారని వారు ఆరోపించారు. సుహాసిని మా ఊరికి వస్తే  వీళ్ల బండారం బయట పడుతుందనే భయంతో.. ఆమెను చంపేశారని అంటున్నారు. విషయం తెలియడంతో రూరల్‌ సీఐ ఓబులేసు, ఎస్‌ఐ చంద్రశేఖర్‌ ఆదివారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు భర్త, అత్త, మామపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement