మా కుటుంబంపై విషప్రచారం చేస్తున్నారు

Manchu Vishnu Complaint Against TDP Activists - Sakshi

టీడీపీ సానుభూతిపరులపైమంచు విష్ణు ఫిర్యాదు

సాక్షి, సిటీబ్యూరో: తెలుగుదేశం పార్టీ శ్రేణులు తమ కుటుంబంపై విషప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్‌బాబు తనయుడు మంచు విష్ణు  మంగళవారం హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. ఆయనతో పాటు మోహన్‌బాబు తరఫున రెండు వేర్వేరు ఫిర్యాదులు అందజేశారు. సోషల్‌ మీడియాలో తమపై విష ప్రచారం జరుగుతోందని, అసత్యాలతో కూడిన అసభ్యంతరకరమైన పోస్టింగ్‌లు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సైబర్‌ క్రైమ్‌ అదనపు డీసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులే తమపై ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని, నకిలీ ఐడీలతో సోషల్‌మీడియాలో   పోస్టింగ్‌లు పెడుతున్నారని ఆరోపించారు.

కొన్ని వీడియోలు, ఫేస్‌బుక్‌లో వచ్చిన కామెంట్లకు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ను సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు అందజేశారు. కొందరు వ్యక్తులు అమెరికా నుంచి ఫోన్లు చేసి తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్లిన విషయం కూడా  వారికి తెలుస్తోందని, ఇక్కడ ఉంటున్న వారే తమ కుటుంబ సభ్యుల కదలికల్ని గుర్తించి బెదిరింపులకు పాల్పడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఫిర్యాదు  అందుకున్న అదనపు డీసీపీ పూర్తిస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top