కన్నకూతురినే కడతేర్చాడు | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 22 2018 11:53 AM

Man kills teenage Daughter - Sakshi

ములకలచెరువు: అభం శుభం తెలియని 14 ఏళ్ల బాలికను కన్న తండ్రే దారుణంగా హతమార్చిన ఘటన చిత్తూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ముకలచెరువు మండలం భోరెడ్డిగారిపల్లెకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి తన కుమార్తె లక్ష్మీప్రసన్న(14)ను హైదరాబాద్‌ హాస్టల్లో చదివిస్తానని చెప్పి ఈ నెల 2న ఇంటినుంచి తీసుకెళ్లాడు. తెలంగాణలోని మొదక్‌ జిల్లా తుప్రాన్‌ అటవీ ప్రాంతంలో బాలికను హత్యచేసి మృతదేహాన్ని అక్కడే వదిలి వచ్చాడు. కుమార్తె అదృశ్యమైందని కుటుంబసభ్యులను నమ్మించి ఈ నెల 11న ములకలచెరువు పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఎస్‌ఐ ఈశ్వరయ్య అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎలా అదృశ్యమైందన్న విషయమై విచారిస్తున్న పోలీసులకు తండ్రి వ్యవహారశైలి అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని విచారించగా అసలువిషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ములకలచెరువు పోలీసులు ఆదివారం నిందితుడ్ని వెంటబెట్టుకొని తుఫ్రాన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు.

తుప్రాన్‌ పీఎస్‌లో హత్య కేసు నమోదు..
ఈ నెల 5న తుప్రాన్‌ అటవీ ప్రాంతంలో లక్ష్మిప్రసన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు గుర్తు తెలియని బాలిక హత్యకు గురైనట్లు కేసు నమోదుచేశారు. ఈ నేపథ్యంలో నిందితుడిని కస్టడీలోకి తీసుకున్న తుప్రాన్‌ పోలీసులు కన్న కూతురిని హత్య చేయడానికి గల కారణాలపై విచారిస్తున్నట్లు తెలిసింది. కేసు విచారణలో ఉందని, హత్యకు గల కారణాలు త్వరలో వెల్లడిస్తామని ఎస్‌ఐ ఈశ్వరయ్య తెలిపారు.

Advertisement
Advertisement