పొలంలోనే ప్రాణం పోయింది

Man Died  To Electric Shock In Jagtial - Sakshi

సారంగాపూర్‌(జగిత్యాల): నారు మడికి నీరు  పెట్టేందుకు వెళ్లి ఓ యువరైతు విద్యుదాఘాతంతో పొలంలోనే ప్రాణాలు వదిలిన సంఘటన జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలం రేకులపల్లిలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన రైతు పంజాల గంగాధర్‌(32) తనకున్న ఎకరంనర పొలంలో వరి సాగుచేసేందుకు నారు పోశాడు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో పొలం నాటు వేయాలని నిర్ణయించాడు. ఈక్రమంలో నారు మడికి నీరుపెట్టేందుకు ఉదయం వెళ్లాడు. కరెంట్‌ లేకపోవడంతో మోటార్‌ ఆన్‌కాలేదు. దీంతో పంపులోకి కుండతో నీరు పోశాడు. ఈక్రమంలోనే విద్యుత్‌సరఫరా కావడంతో మోటార్‌ స్టార్టయ్యింది. పొలం నుంచి బయటకు వచ్చే క్రమంలో పైపును పట్టుకున్నాడు.

అప్పటికే మోటార్‌పంపు, పైప్‌నకు విద్యుత్‌ సరఫరా కావడంతో గంగాధర్‌ విద్యుదాఘాతానికి గురయ్యాడు. సమీపంలోనే ఉన్న అతని భార్య రజిత, వ్యవసాయకూలీలు గమనించి పెద్దగా కేకలు వేయడంతో మరికొందరు రైతులు సబ్‌స్టేషన్‌కు సమాచారం అందించి విద్యుత్‌ సరఫరా నిలిపివేయించారు. అయితే అప్పటికే గంగాధర్‌ మృతిచెందాడు. భార్య రజిత, కుమారుడు సిద్దు, కూతురు అక్షయ ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం ఈనెల 14 నుంచి అమలులోకి రానుండడంతో గంగాధర్‌ కుటుంబానికి బీమా డబ్బులు సైతం అందకుండా పోయాయి. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అధికారులను కోరారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top