ప్రేమజంట బలవన్మరణం | Love Couple Died By Suicide Together | Sakshi
Sakshi News home page

ప్రేమజంట బలవన్మరణం

Jun 29 2018 2:09 AM | Updated on Apr 3 2019 5:32 PM

Love Couple Died By Suicide Together - Sakshi

ప్రశాంత్, గౌతమి(ఫైల్‌)

కొండగట్టు (చొప్పదండి): ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం ఈ ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ నరసింహస్వామి గుట్టపై వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలం హాసాకొత్తూర్‌ గ్రామానికి చెందిన గంగన్న, నర్సు దంపతుల కూతురు గౌతమి (20), అదే గ్రామానికి చెందిన భోజన్న, గంగు దంపతుల కుమారుడు ప్రశాంత్‌ (22) ప్రేమించుకున్నారు. వీరిద్దరి కులాలు వేరు. అయితే.. ప్రేమ విషయం ఇరుకుటుంబాల పెద్దలకు తెలియడంతో మార్చి 23న గౌతమికి అదే గ్రామానికి చెందిన సమీప బంధువుల అబ్బాయితో నిశ్చితార్థం జరిగింది.

ఏప్రిల్‌ 7న వివాహం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్, గౌతమి అదేరోజు ఇంటి నుంచి పారిపోయారు. వారి ఆచూకీ కోసం ఇరువురి కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఫలితం దక్కకపోవడంతో ఏప్రిల్‌ 10న కమ్మర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కొడిమ్యాల మండలం నల్లగొండ శివారులో చెట్టుకు ఉరివేసుకున్నారు. ఘటనాస్థలంలో లభించిన బ్యాగు, సెల్‌ఫోన్, పర్స్‌ నుంచి దొరికిన ఆధారాల ప్రకారం.. వారిది నిజామాబాద్‌ జిల్లా హాసాకొత్తూర్‌ గ్రామంగా గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయి ఉండటంతో అక్కడే పంచనామా చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement