ఆడ నా? మగ నా? పోలీసుల పరేషాన్

Kushaiguda Police Dilemma In Accused Gender Detection - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని కుషాయిగూడ కార్ల చీటింగ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. హైదరాబాద్ పోలీసులకు ఈ కేసు ముచ్చెమటలు పట్టిస్తున్నది. ఈ కేసులో ఎలా ముందుకు పోవాలో అర్థం కాక పోలీసులు లబోదిబోమంటున్నారు. మాకు క్లారిటీ ఇవ్వండి మొర్రో అంటూ ఫొరెన్సిక్ డాక్టర్లను పోలీసులు వేడుకుంటున్నారు. కీలక మలుపులు తిరుగుతున్న కుషాయిగూడ కార్ల చీటింగ్ కేసు వివరాల్లోకి వెళ్తే.. ఈ కేసులో ఈ నెల 3వ తేదీన పోతులయ్య, సయ్యద్ సిరాజ్ హుస్సేన్ లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే ఈ కేసులో అరెస్టయిన సయ్యద్ సిరాజ్ హుస్సేన్ అడ నా లేదంటే మగ నా అనే విషయం తెలియక పోలీసులు గందరగోళంలో పడ్డారు. 

కేసు విచారణలో సిరాజ్‌ హుస్సేన్‌ను మగ మనిషిగా భావించిన పోలీసులు ఆ మేరకు విచారణ చేపట్టారు. కానీ, కేసుకు సంబంధించి డైరీ నమోదు సమయంలో జెండర్ కాలమ్ నింపే టైంలో తాను అడ్డ పిల్ల అని సిరాజ్ హుస్సేన్‌ చెప్పడంతో పోలీసులు కంగు తిన్నారు. మూడు ఏళ్ల కిందట ముంబైలో లింగ మార్పిడి చేయించుకున్నట్లు సిరాజ్ చెప్పడంతో పోలీసులు మరింత డైలమాలో పడ్డారు. తన పేరు సయ్యద్ సిరాజ్ హుస్సేన్ కాదని, షాభిన అస్మి అని వెల్లడించారు. తను కరీంనగర్‌ జిల్లా ఫతేపూర్‌ గ్రామానికి చెందిన అమ్మాయినని కూడా పేర్కొన్నారు. దీంతో తలపట్టుకోవడం కుషాయిగూడ పోలీసుల వంతైంది.

తాము అరెస్ట్‌ చేసిన వ్యక్తి ఆడ నా లేక మగ నా తేలిన తర్వాతే ఈ కేసులో తదుపరి విచారణ చేపట్టాలని పోలీసులు భావిస్తున్నారు. అందుకోసం ఆ వ్యక్తికి లింగ నిర్ధారణ పరీక్షలు చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా గాంధీ ఆసుపత్రిలోని ఫొరెన్సిక్ విభాగానికి పోలీసులు లేఖ రాశారు. వైద్యుల నివేదిక ఆధారంగా సదరు నిందిత వ్యక్తి ఆడ నా లేదా మగ అన్నది తేల్చుకుని.. జెండర్ కాలమ్ నింపి కేసులో ముందుకు వెళ్తామని పోలీసులు చెబుతున్నారు. కాగా, నేరస్తులను, నిందితులను చెడుగుడు ఆడుకునే పోలీసులకు ఈ వ్యక్తి చుక్కలు చూపిస్తున్నాడని టాక్ మొదలైంది.

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top