భార్యను సజీవదహనం చేసిన భర్త

Husband Killed Wife In Kamareddy - Sakshi

కిరోసిన్‌ పోసి నిప్పంటించిన వైనం

బీర్కూర్‌(బాన్సువాడ) : కట్టుకున్న భార్యను కిరోసిన్‌ పోసి నిప్పటించి సజీవదహనం చేసిన ఘటన బీర్కూ ర్‌ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి సంభవించింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్‌ మండల కేంద్రంలోని ఇందిరా కాలనీకి చెందిన మెరిగె అశోక్‌కు మెరిగె లక్ష్మి(35)తో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. కొద్ది సంవత్సరాలుగా వారిమధ్య మనస్పర్థలు ఎక్కువయ్యాయి. భర్త అశోక్‌ రోజూ తాగివచ్చి భార్యను హింసించేవాడని చుట్టుపక్కల వారు వివరించారు.

కాగా రోజు మాదిరిగానే ఆదివారం తాగి వచ్చిన భర్తతో లక్ష్మి గొడవ పడింది. అనంతరం అశోక్‌ తన ఇద్దరు పిల్లలను పక్కింట్లో పడుకోబెట్టాడు. అదే సమయంలో తల్లిదండ్రుల ఘర్షణను అడ్డుకోవడానికి ప్రయత్నించిన కుమారుడిని బయటకు పంపించి వేసి అశోక్‌ తన భార్య లక్ష్మిపై కిరోసిన్‌ పోసి నిప్పటించాడు. దీంతో సజీవదహనమైన లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చే రుకుని మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామని ఎస్సై పూర్ణేశ్వర్‌ వివరించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top