భార్యాబిడ్డలను జూదమాడిన భర్త | Husband Bets Wife And Children | Sakshi
Sakshi News home page

భార్యాబిడ్డలను జూదమాడిన భర్త

Mar 27 2018 9:42 PM | Updated on Jul 27 2018 2:21 PM

Husband Bets Wife And Children - Sakshi

న్యూఢిల్లీ : ద్వాపర యుగంలో ధర్మరాజు ద్రౌపదిని జూదమాడాడని మహాభారతంలో విన్నాం. కానీ ఆధునిక యుగంలో మనుషులు సిగ్గుతో తలదించుకునేలా చేసాడు జూదానికి బానిసైన ఓ వ్యసనపరుడు. ఉత్తరప్రదేశ్‌లోని బులాంద్‌షార్‌లో జరిగిందీ ఘటన. భార్యని జూదమాడి ఓడిన మోహిసిన్‌ అనే వ్యక్తి తన ఆరు, ఏడేళ్ళ కొడుకులిద్దరినీ వదల్లేదు.

చిన్నారులను సైతం జూదంలో పెట్టాడు. భార్య, బిడ్డలిద్దర్నీ మోహిసిన్‌ జూదంలో ఓడిపోవడంతో జూదంలో గెలిచిన ఇమ్రాన్‌ నేరుగా మోహిసిన్‌ ఇంటికి వెళ్ళి మోహిసిన్‌ భార్యను తనతో రమ్మని బలవంత పెట్టిన ఘటన స్థానికులను నివ్వెరపోయేలా చేసింది. మోహిసిన్‌ భార్య దీనికి నిరసనగా ఆందోళనకు దిగడంతో పంచాయితీ నిర్వహించారు.

మరింత ఆశ్చర్యానికి గురిచేసే విషయం ఏమిటంటే మోహిసిన్‌ భార్య జూదగాడితో వెళ్ళేందుకు నిరాకరించడంతో కనీసం ఇద్దరు పిల్లల్లో ఒకరినైనా జూదంలో గెలిచిన ఇమ్రాన్‌ వెంట పంపాలని పంచాయితీ తీర్పునిచ్చింది. దీంతో మోహిసిన్‌ ఇద్దరు పిల్లల్లో ఒకరిని జూదంలో గెలిచిన ఇమ్రాన్‌ తన వెంట తీసుకెళ్ళడం కలకలం రేపింది.

ఈ ఘటన అనంతరం తనను జూదమాడిన భర్తకు విడాకులిచ్చేసిన భార్య తన భర్తతో పాటు, తనను బలవంతంగా తీసుకెళ్ళేందుకు ప్రయత్నించిన ఇమ్రాన్‌ సహా మరో నలుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. అనేకసార్లు పోలీసు స్టేషన్‌ చుట్టూ తిరిగినా, ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె కోర్టుని ఆశ్రయించారు. మోహిసిన్‌ భార్య పిటిషన్‌పై స్పందించిన చీఫ్‌ జ్యూడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు సోమవారం కేసు రిజిస్టర్‌ చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.

నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఆలస్యంగా వేట మొదలు పెట్టారు. అయితే ఈ ఘటనలో భార్యాబిడ్డల్ని జూదంలో పెట్టిన మోహిసిన్‌ తొలి ముద్దాయి అయితే, వాళ్ళ కొడుకుని జూదగాడితో పంపిన పంచాయితీ సైతం నేరంలో భాగం కావడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement