గులాబీ తోటలో పరువు హత్య

Honor Killing In Karnataka - Sakshi

గొంతుకోసి చంపిన దుండగులు

ఆరునెలల కిందటే ప్రేమ పెళ్లి  

కర్ణాటక, దొడ్డబళ్లాపురం: ప్రేమకు చిహ్నమైన గులాబీ తోటలో గులాబీ పొదలు ప్రేమికుని రక్తంతో తడిసిపోయాయి. గులాబీ తోటల్లో విహరించాల్సిన వరుడు అక్కడే విగతజీవిగా మారిపోవడంతో కొత్త కాపురంలో శాశ్వతంగా విషాదం తాండవిస్తోంది. ఐటీ సిటీ శివార్లలో పరువు హత్య కలకలం సృష్టిస్తోంది. యువకుణ్ని ‘గుర్తు తెలియని దుండగులు’ గొంతుకోసి దారుణంగా హత్యచేసిన సంఘటన దేవనహళ్లి తాలూకా నల్లూరు గ్రామంలో చోటుచేసుకుంది.  ఇదే తాలూకా అరిశినకుంట గ్రామానికి చెందిన గిరిజన కుటుంబానికి చెందిన హరీష్‌ నాయక్‌ (30) హత్యకు గురైన యువకుడు. ఆరు నెలల క్రితం నల్లూరు గ్రామానికి చెందిన బీసీ వర్గం యువతిని హరీష్‌ ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. స్థానికంగా ఇతడు ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసవాడు. తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తారు. అమ్మాయి తరఫువారు సమాజంలో పలుకుబడి ఉన్నవారని తెలిసింది. అప్పటి నుంచి హరీష్‌కు బెదిరింపులు వస్తున్నట్లు బంధుమిత్రులు చెబుతున్నారు. 

బుధవారం ఉదయం..  
ఇలా ఉండగా మంగళవారం రాత్రి నల్లూరు వద్ద ఒక గులాబీ తోటలో హరీష్‌ హత్యకు గురయ్యాడు. గొంతు కోసి ఉంది. హత్య ఎవరు చేశారు, ఎలా, ఎందుకు చేశారనే విషయాలు తెలిసిరాలేదు. బుధవారం పొద్దున శవాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలాన్ని చెన్నరాయపట్టణ పోలీసులు పరిశీలించారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో గొడవలు జరగకుండా పోలీసులు నిఘా వేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top