గుట్కా ఫ్రమ్‌ గుజరాత్‌!

Gutka from Gujarat - Sakshi

పాన్‌మసాలా, జర్దా రూపంలో వేర్వేరుగా తయారీ

రైళ్లలో తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయం

మాణిక్‌చంద్‌ బ్రాండ్‌ కాపీ...

ఫ్రాంచైజీల పేరుతోనూ దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు

నలుగురి అరెస్టు, రూ.1.4 కోట్ల నిషిద్ధ ఉత్పత్తులు సీజ్‌

గుజరాత్‌లో ఏర్పాటు చేసిన యూనిట్స్‌లో వేర్వేరు ఉత్పత్తులుగా గుట్కా తయారు చేసి.. రైళ్లలో హైదరాబాద్‌కు అక్రమ రవాణా చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును ఉత్తర మండల టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ కేంద్రంగా సాగుతున్న ఈ దందాకు సంబంధించి ప్రధాన సూత్రధారి అవల అభిషేక్‌ సహా నలుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1.4 కోట్ల విలువైన నిషే ధిత ఉత్పత్తులు స్వాధీనం చేసు కున్న ట్లు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ సోమవారం వెల్లడించా రు. సమావేశంలో డీసీపీ పి.రాధాకిషన్‌ రావు పాల్గొన్నారు.
–సాక్షి, హైదరాబాద్‌

ఇక్కడ చిక్కడంతో..
సైదాబాద్‌కు చెందిన అవల అభిషేక్‌.. 2008 నుంచి బేగంబజార్‌ కేంద్రంగా గుట్కా, జర్దా, పాన్‌మసాలా వ్యాపారం చేస్తూ మాణిక్‌చంద్‌ సంస్థకు ప్రధాన ఏజెంట్‌గా ఉన్నాడు. 2015లో సెవెన్‌హిల్స్‌ మార్కెట్‌ ప్రాంతంలో సొంతంగా సంస్థ ఏర్పాటు చేశాడు. బీబీనగర్‌ సమీపంలోని నేమర గోముల గ్రామంలో ఓ యూనిట్‌ స్థాపించి ‘7 హిల్స్‌ మాణిక్‌చంద్‌’పేరుతో పాన్‌ మసాలా, జర్దా తదితరాలను ఉత్పత్తి చేసి విక్రయించడం ప్రారంభించాడు. మాణిక్‌చంద్‌ పేరును వినియోగించడంపై పోలీసులు లోతుగా ఆరాతీశారు. నిషేధిత పొగాకు ఉత్పత్తులు తయారు చేస్తుండటంతో గతేడాది బీబీనగర్‌ పోలీసులు యూనిట్‌పై దాడి జరిపి కేసు నమోదు చేసి అభిషేక్, అతడి తండ్రి ఏవీ సురేశ్‌ తదితరులను అరెస్టు చేశారు. దీంతో అభిషేక్‌ తన దందాను గుజరాత్‌కు మార్చాడు. అక్కడ ఉన్న తన ఏజెంట్‌ శైలేష్‌ జైన్‌ ద్వారా అహ్మదాబాద్, రాజ్‌కోట్‌లో యూనిట్లు ఏర్పాటు చేశాడు.

రైల్వేస్టేషన్‌ నుంచే సరఫరా
పోలీసుల కన్నుకప్పేందుకు గుజరాత్‌లో ‘7 ఎంసీ టొబాకో’పేరుతో ఒకటి, ‘7 హిల్స్‌ మాణిక్‌చంద్‌ పాన్‌ మసాలా’పేరిట మరొకటి తయారు చేస్తున్నాడు. ఈ రెండింటినీ వేర్వేరుగా ప్యాక్‌ చేసి అహ్మదాబాద్‌ నుంచి రైల్వేలో వివిధ రకాల పేర్లతో సికింద్రాబాద్‌కు పంపిస్తున్నాడు. ఇలా వచ్చిన ఉత్పత్తులను హైదరాబాద్‌లో నిల్వ చేసేందుకు గోడౌన్‌ నిర్వహించట్లేదు. రైల్వేస్టేషన్‌లో ఉండే ఏజెంట్లు షబ్బీర్‌ మొయినుద్దీన్, సయ్యద్‌ జబ్బార్‌ అహ్మద్‌లు ఈ ఉత్పత్తులను తీసుకుని అభిషేక్‌ ఆదేశాల ప్రకారం నేరుగా డిస్ట్రిబ్యూటర్లు, విక్రేతలకు సరఫరా చేస్తున్నారు.

ఇందుకు సయ్యద్‌ మహ్మద్‌కు చెందిన వాహనం వాడుతున్నారు. షబ్బీర్, జబ్బార్‌లు ఉత్తరప్రదేశ్, ఢిల్లీల నుంచి వచ్చే పొగాకు ఉత్పత్తుల్ని తీసుకుంటూ గోషామహల్‌కు చెందిన తబ్రేజ్, బేగంబజార్‌ వాసి మనీష్‌లకు సరఫరా చేసి అమ్మిస్తున్నారు. దాదాపు 2 నెలలుగా సాగుతున్న ఈ దందాపై నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌ రావుకు సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో ఎస్సైలు కేఎస్‌ రవి, కె.శ్రీకాంత్, పి.పరమేశ్వర్, జి.రాజశేఖర్‌రెడ్డి వల పన్నారు. గోపాలపురం ప్రాంతంలో రెండు వాహనాలను తనిఖీ చేయగా నిషిద్ధ ఉత్పత్తులు బయటపడ్డాయి. దీంతో అభిషేక్, షబ్బీర్, జబీర్, మొహ్మద్‌లను అరెస్టు చేశారు. 

ఫ్రాంచైజీల పేరుతో మోసం
కాగా, నిషేధిత ఉత్పత్తుల దందా చేస్తూనే అనేక మందిని అభిషేక్‌ మోసం చేశాడు. ‘7 హిల్స్‌ మాణిక్‌చంద్‌ పాన్‌ మసాలా’ఉత్పత్తులకు సంబంధిం చిన ఫ్రాంచైజీలు, డిస్ట్రి బ్యూషన్స్, సీ అండ్‌ ఎఫ్‌ ఏజె న్సీలు ఇస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. తెలంగాణ, ఏపీ, బిహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన అనేక మంది అభిషేక్‌ను సంప్రదిం చారు. వారి నుంచి సెక్యూరిటీ డిపాజిట్ల పేరుతో లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. వారితో అక్కడ దుకా ణాలు ఏర్పాటు చేయించి ముందు కొంత సరుకు సరఫరా చేసి తర్వాత అదీ వెనక్కు తీసుకున్నాడు. నగదు ఇచ్చేయాలని అడిగిన వారికి ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ అయ్యాయి. దీంతో ముషీరాబాద్, ఏపీలోని విశాఖ పట్నంలో ఇతడిపై కేసులు నమోదయ్యాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top