బావతో పెళ్లి ఇష‍్టంలేక బలవన్మరణం | girl student suicide | Sakshi
Sakshi News home page

బావతో పెళ్లి ఇష‍్టంలేక బలవన్మరణం

Dec 26 2017 7:55 PM | Updated on Nov 6 2018 8:08 PM

సాక్షి, టీ.నగర్‌: తనను వివాహం చేసుకోవాలని సొంత అక్క భర్త ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురైన కళాశాల విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. పుదుచ్చేరి విల్లియనూరు సమీపం సేందనత్తం పేట ప్రాంతానికి చెందిన ఆనంద్‌ ఎద్దులబండి కార్మికుడు. ఈయనకు మంజు (25), లలిత (19) ఇద్దరు కుమార్తెలు, అరుణ్‌పాండియన్‌ అనే కుమారుడు ఉన్నారు. మంజు అదే ప్రాంతానికి చెందిన అంబేద్‌ (30)ను ఐదేళ్ల కిందట ప్రేమించి వివాహం చేసుకుంది.

లలిత కదిర్‌ గ్రామం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల్లో రెండో సంవత్సరం చదువుతోంది. ఆమెను ప్రతిరోజు బావ అంబేద్‌ కళాశాలకు తీసుకువెళ్లేవాడు. దీంతో ఏర్పడిన పరిచయం కారణంగా అంబేద్‌ తనను వివాహం చేసుకోవాలని లలితపై ఒత్తిడి తెచ్చేవాడు. ఈ విషయం లలిత తల్లిదండ్రులకు తెలిసింది. వారు లలితకు మరొకరితో వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ వివాహాన్ని అంబేద్‌ అడ్డుకున్నాడు. దీనిపై లలిత తల్లిదండ్రులు విల్లియనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరువర్గాలను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు. ఆ తరువాత కూడా అంబేద్‌ లలితను వేధిస్తూ వచ్చాడు. సోమవారం అంబేద్‌ వివాహం విషయంపై లలితతో వాగ్వాదానికి దిగాడు. దీంతో విరక్తి చెందిన లలిత సెల్‌ఫోన్‌లో అక్క మంజుతో మాట్లాడి రోదించింది. తరువాత ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై పోలీసులు మంగళవారం కేసు నమోదుచేసుకుని విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement