పాము కాటుతో విద్యార్థిని మృతి

Girl Child Died With Snake Bite in Nizamabad - Sakshi

డిచ్‌పల్లి: మండలంలోని యానంపల్లి తండాకు చెందిన ధనావత్‌ విష్ణుప్రియ(8) అనే విద్యార్థిని పాము కాటుతో మృతి చెందింది. తండావాసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సోమవారం రాత్రి భోజనాలు చేశాక తండాకు చెందిన ధనావత్‌ శ్రీనివాస్‌– యమున దంపతులు రోజులాగే తమ ఇద్దరు కూతుళ్లలో ఇంట్లో నిద్రపోయారు. అర్ధరాత్రి వారి పెద్ద కూతురు విష్ణుప్రియ ఏడ్వడంతో నిద్రలేచిన శ్రీనివాస్‌ లైటు వేసి చూడగా కూతురు కాలిపై పాము కాటు వేసిన గుర్తులు కన్పించాయి. పక్కనే కట్లపాము కన్పించడంతో దానిని కొట్టి చంపివేశారు. వెంటనే విష్ణుప్రియను ఆటోలో చికిత్స కోసం నిజామాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. దీంతో కన్నీటితో వెనుదిరిగారు. రెండో తరగతి చదువుతున్న విష్ణుప్రియ ఆకస్మిక మృతితో తండాలో విషాదం నెలకొంది. కూతురు మృతదేహాన్ని చూస్తూ శ్రీనివాస్, యమున దంపతులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top