పెను విషాదం.. 200 మంది జలసమాధి | Ferry Sinking in Indonesia Toba Lake | Sakshi
Sakshi News home page

Jun 21 2018 2:58 PM | Updated on Jun 21 2018 3:41 PM

Ferry Sinking in Indonesia Toba Lake - Sakshi

జకార‍్త: సామర్థ్యానికి మించి భారీగా ప్రయాణికులను ఎక్కించుకోవటంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇండోనేషియా సుమత్రా దీవిలోని టోబా సరస్సులో సోమవారం ఓ ఫెర్రీ ప్రమాదానికి గురైంది. ఫెర్రీ నీట మునగటంతో అందులోని ప్రయాణికులు గల్లంతయ్యారు. తొలుత ఇది స్వల్ఫ ప్రమాదమని భావించినప్పటికీ, ఫెర్రీలో 200 మందికి పైగా ఉన్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పటంతో ఇది భారీ ప్రమాదమని అధికారులు నిర్ధారించారు.

ఉత్తర సమత్రా ప్రొవిన్స్‌లోని టోబా సరస్సు ప్రపంచంలోనే అతిపెద్ద వోల్కనిక్‌ సరస్సు. రంజాన్‌ పవిత్ర మాసం ముగియటంతో సోమవారం స్థానిక ప్రజలు ఫెర్రీలో వేడుకల కోసం సిద్ధమయ్యారు. అయితే కేవలం 45 మంది సామర్థ్యం ఉన్న ఫెర్రీలోకి.. భారీ సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకోగా, అదే సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు సంభవించటంతో ఫెర్రీ నీట మునిగింది. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ప్రయాణికులకు రక్షించేందుకు రంగంలోకి దిగారు.

ఒడ్డున ఆర్తనాదాలు... ప్రమాదం జరిగాక సుమారు 18 మంది ఈదుకుంటూ ఒడ్డుకుచేరుకోగా, వారిచ్చిన సమాచారం మేరకు ఫెర్రీలో 200 మందికిపైగా ఉన్నట్లు తెలిసింది. వెంటనే రంగంలోకి దిగిన సహయక సిబ్బంది, కాసేటికి మూడు మృతదేహాలతో టిగారస్‌ పోర్టు ఒడ్డుకు చేరారు. ప్రయాణికుల బంధువులంతా ఒడ్డున చేరుకుని తమ వారి కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. గజ ఈతగాళ్లతో వెతికించినా ఎలాంటి లాభం లేకపోవటంతో అధికారులు సైన్యం సాయం తీసుకున్నారు. చివరకు ఫెర్రీ సుమారు టోబా సరస్సు 1500 అడుగుల లోతులో మునిగిపోయిందని తేల్చారు.(పూర్తి లోతు 1600 అడుగులపైమాటే...) మృతదేహాలు అందులోనే చిక్కుకుని ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఫెర్రీని పైకి తెచ్చే యత్నాలు చేస్తున్నారు. విఫలమైతే డైవర్స్‌ను లోపలికి పంపి మృత దేహాలను వెలికి తీస్తామని అధికారులు బంధువులతో చెప్పారు.

మరోవైపు ప్రమాదానికి కారణం తమ నిర్లక్ష్యమేనని పర్యాటక శాఖ ప్రకటించింది. సామర్థ్యానికి మించి పర్యాటకులను ఎక్కించుకున్నప్పుడు వారందరికీ లైఫ్‌ జాకెట్లు సమకూర్చాలన్నది నిబంధన. పైగా టికెట్లు తీసుకోకుండా ప్రయాణికులందరినీ ఫెర్రీలో ఎక్కించుకున్నారని తేలింది. ఇవేవీ పర్యవేక్షించకుండా అధికారులు ఫెర్రీని టోబా సరస్సులోకి అనుమతించారు. మొత్తం 192 మంది జలసమాధి అయి ఉంటారని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది. ఇండోనేషియాలో ఏడాదిలో వందల బోటు ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఇందులో 12 శాతం వాతావరణం అనుకూలించకపోవటంతో జరిగేవి అయితే, 40 శాతం నిర్లక్ష్యం, మానవ తప్పిదం మూలంగానే అని తేలింది. ప్రస్తుతం జరిగిన ప్రమాదం ఇండోనేషియా చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదంగా అధికారులు చెబుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement