‘ఇదే.. ప్రంబనన్ ఆలయ వైభవం’ : ప్రధాని మోదీ | PM Modi Shares Stunning Aerial View of Historic Prambanan Temple in Indonesia | Sakshi
Sakshi News home page

‘ఇదే.. ప్రంబనన్ ఆలయ వైభవం’ : ప్రధాని మోదీ

Jul 8 2026 11:39 AM | Updated on Jul 8 2026 11:54 AM

PM Modi Shares Indonesias Historic Prambanan Temple

జోగ్‌జకర్తా (ఇండోనేషియా): ఇండోనేషియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నాడిక్కడ దాదాపు వెయ్యి ఏళ్ల నాటి చారిత్రక ప్రంబనన్ హిందూ దేవాలయాల సముదాయానికి సంబంధించిన అద్భుతమైన వైమానిక దృశ్యాలను (ఏరియల్ వ్యూ) షేర్‌ చేశారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో కలిసి హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాన్ని చూసి, ‘అద్భుతమైన ప్రంబనన్ ఆలయం!’ అంటూ ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా ప్రశంసించారు.

భారతదేశ ఆర్థిక, సాంస్కృతిక సహాయంతో ఈ  ఆలయ ప్రాంగణంలో చేపట్టనున్న పరిరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్టు అధికారిక ప్రారంభోత్సవానికి ముందు ఈ వైమానిక ప్రయాణం సాగింది. భారత్ అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్’ విధానంలో భాగంగా ఇరు దేశాల సాంస్కృతిక దౌత్యంలో ఇదొక కీలక మైలురాయిగా నిలిచింది. మంగళవారం ప్రధాని మోదీ, అధ్యక్షుడు ప్రబోవోల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను పరస్పరం మార్చుకున్నారు.
 

జావా ద్వీపంలో ఉన్న ప్రంబనన్ ఆలయ సముదాయం ఇండోనేషియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. ఆగ్నేయాసియాలో కంబోడియాలోని అంగ్ కోర్ వాట్ తర్వాత ఇది రెండో స్థానంలో ఉంది. 9వ శతాబ్దంలో హిందూ మాతారామ్ రాజవంశానికి చెందిన రాజు రాకై పికాతన్ దీని నిర్మాణాన్ని ప్రారంభించగా, ఆయన వారసుడు లోకపాల పూర్తి చేశారు. ఇక్కడి శివ, విష్ణు, బ్రహ్మ ఆలయాలలో 47 మీటర్ల ఎత్తున్న ప్రధాన శివాలయం అత్యంత విశిష్టమైనది. ఈ ఆలయ గోడలపై చెక్కిన రామాయణ గాథ శిల్పాలు భారత్-ఇండోనేషియాల ప్రాచీన నాగరికత బంధానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement