రైల్వే వెబ్‌సైట్‌లో నకిలీ ఐడీలు!

Fake IDs in Railway website, Agent Arrested in Guntur - Sakshi

ప్రయాణికులను దోచుకుంటున్న ఏజెంట్‌ అరెస్ట్‌

లక్ష్మీపురం (గుంటూరు): గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో గత ఏడాది నుంచి నకిలీ ఐడీలతో టికెట్లు బుక్‌ చేసి రైల్వే ప్రయాణికులను మోసగిస్తున్న ట్రావెల్‌ వ్యాపారిని ఆర్పీఎఫ్‌ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు ఆర్పీఎఫ్‌ సీఐ సరోజ్‌కుమార్‌ వివరాలను వెల్లడించారు. పాత గుంటూరు ప్రాంతానికి చెందిన టి.శివప్రసాద్‌ సునీతా ట్రావెల్స్‌ అండ్‌ డిజిటల్‌ స్టూడియో పేరుతో ఏడాది క్రితం వ్యాపారం ప్రారంభించాడు. రైల్వే వెబ్‌సైట్‌లో 10 నకిలీ ఐడీలను సృష్టించాడు.

పండుగల సమయంలోనూ, దూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు టికెట్లు బుక్‌ చేసి వెయిటింగ్‌ ఉన్నా వాటిని కన్ఫార్మ్‌డ్‌ టికెట్లుగా మార్చేవాడు. ఆ టికెట్లను ఐఆర్‌సీటీసీ కంటే అధిక మొత్తానికి విక్రయించేవాడు. ప్రయాణికులు రైలు ఎక్కిన సమయంలో ఆ టికెట్లు చెల్లేవికాదు. దీనివల్ల ఎంతో మంది మార్గం మధ్యలోనే దిగిపోవడం లేదా జరిమానాలు చెల్లించేవారు. దీనిపై సమాచారం అందుకున్న గుంటూరు డివిజన్‌ రైల్వే ఆర్పీఎఫ్‌ సీఐ సరోజ్‌కుమార్‌ ఏఎస్సై పి.వేణు, హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసరావు సిబ్బందితో కలసి శివప్రసాద్‌ షాప్‌లో తనిఖీలు చేశారు. శివప్రసాద్‌ వద్ద ఉన్న రూ.1.75 లక్షల విలువైన 135 రైలు టికెట్లను సీజ్‌ చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ సరోజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రయాణికులు నకిలీ టికెట్ల విక్రయించేవారి వలలో పడొద్దని, టికెట్టు కొనుగోలు చేశాక పీఎన్‌ఆర్‌ నంబర్‌ను సరి చూసుకోవాలని సూచించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top