అప్పు తీర్చమన్నందుకు.. ప్రాణం తీశాడు | Eatery Shop Owner Shot Dead By Customer In Kolkata | Sakshi
Sakshi News home page

అప్పు తీర్చమన్నందుకు.. ప్రాణం తీశాడు

Jun 4 2018 3:24 PM | Updated on Jun 4 2018 4:52 PM

Eatery Shop Owner Shot Dead By Customer In Kolkata - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కోల్‌కతా : పాత బాకీ తీర్చమన్నాడన్న కోపంతో బిర్యానీ బండి యాజమానిపై తుపాకీతో కాల్పులు జరిపాడో వ్యక్తి. ఈ సంఘటన ఆదివారం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం పరగణ జిల్లాలోని భట్‌పారా పారిశ్రామిక వాడలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భట్‌పారా పారిశ్రామిక వాడకు చెందిన సంజయ్‌ మండల్‌(40) తోపుడు బండిపై బిర్యానీ పాయింట్‌ నిర్వహిస్తున్నాడు. ఆదివారం రాత్రి 9గంటల సమయంలో అదే ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఫిరోజ్‌(26) అతని స్నేహితులు అక్కడికి వచ్చారు. తమకు బిర్యానీ పార్శిల్‌ కట్టాల్సిందిగా సంజయ్‌ని కోరారు. దీంతో సంజయ్‌ మండల్‌ ముందుగా డబ్బులు ఇస్తేనే బిర్యానీ ఇస్తానన్నాడు.

ఆగ్రహించిన ఫిరోజ్‌ బిర్యానీ అధిక ధరలకు విక్రయిస్తున్నాడని ఆరోపిస్తూ సంజయ్‌తో గొడవ పెట్టుకున్నాడు. గొడవ పెద్దది చేయడం ఇష్టంలేని సంజయ్‌ వారిని పాత బాకీ 190 ఇవ్వాలన్నాడు. పాత బాకీ అడగటంతో కోపగించిన ఫిరోజ్‌ వెంట తెచ్చుకున్న తుపాకీతో సంజయ్‌పై రెండు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర రక్త స్రావంతో సంజయ్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు మహ్మద్‌ ఫిరోజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపినపుడు ఫిరోజ్‌ వెంట ఉన్న మరో ముగ్గురిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement