క్రికెట్‌ బెట్టింగ్‌ ప్రధాన నిందితుడిది ఒంగోలు | cricket betting Main suspect prakasam local person | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ బెట్టింగ్‌ ప్రధాన నిందితుడిది ఒంగోలు

Feb 11 2018 12:40 PM | Updated on Feb 11 2018 12:40 PM

ఒంగోలు క్రైం: క్రికెట్‌ బెట్టింగ్‌ల ప్రధాన సూత్రధారిది ఒంగోలుగా అద్దంకి పోలీసులు గుర్తించారు. క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులో అతడు ఒంగోలులో ఓ సారి అరెస్టయ్యాడు. ఈ నెల 7న క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న దాదాపు 15 మందిని అద్దంకి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అందులో ప్రధాన  క్రికెట్‌ బుకీగా తూము వెంకట్రావుగా గుర్తించారు. వెంకట్రావు బండ్లమిట్టకు చెందిన వ్యక్తి. ప్రస్తుతం ముంగమూరు రోడ్డులో నివాసం ఉంటున్నాడు.  అద్దంకి పోలీసులు నమోదు చేసిన కేసులో ఇతడిని ఎనిమిదో నిందితుడిగా చేర్చడం గమనార్హం. ఇతడు స్థానిక అధికార పార్టీ నాయకులతో సన్నిహితంగా మెలుగుతున్నాడు. క్రికెట్‌ బెట్టింగులపై దర్శి డీఎస్పీ నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించి అద్దంకి పోలీసులను అప్రమత్తం చేశారు.

జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. క్రికెట్‌ బెట్టింగ్‌లతో పాటు గంజాయి వ్యాపారం కూడా వెలుగు చూసింది. ఏజెన్సీ ప్రాంతాలైన నర్సీపట్నం, చింతపల్లి ఏరియాల నుంచి గంజాయి తెప్పించి ఎన్‌డీపీఎస్‌ చట్టాన్ని అతిక్రమించినట్టు కూడా అద్దంకి పోలీసులు కేసు నమోదు చేశారు. అద్దంకి కొత్తపేటకు చెందిన బంగారు వ్యాపారి నన్నాబత్తిన విశ్వరూపాచారి క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందటంతో అతడి ఇంటిపై పోలీసులు దాడి చేశారు. సెల్‌ఫోన్లు ఉపయోగించి ‘క్రికెట్‌ మజా’ అన్న యాప్‌ ద్వారా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం మీద 15 మందిని అరెసుఏ్ట చేశారు. ప్రధాన బుకీలైన తూము వెంకట్రావు, చిలకలూరిపేటకు చెందిన రామకృష్ణ అలియాస్‌ ఆర్కేలను అరెస్టు చేయాల్సి ఉంది. వెంకట్రావు తన అనుచరులతో ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి తెప్పించేవాడని నన్నాబత్తిన విశ్వరూపాచారి పోలీసులకు రెవెన్యూ అధికారుల సమక్షంలో వాంగ్మూలం ఇచ్చాడు. సుమారు 25 ఏళ్లుగా క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న తూము వెంకట్రావు కోట్లాది రూపాయలు ఆర్జించాడని కూడా ప్రచారం జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement