వదంతులకు మరో ప్రాణం బలి | Child Kidnapping Rumour, Hyderabadi Man Died In An Attack In Karnataka | Sakshi
Sakshi News home page

Jul 15 2018 2:50 AM | Updated on Jul 15 2018 4:48 AM

Child Kidnapping Rumour, Hyderabadi Man Died In An Attack In Karnataka - Sakshi

మహ్మద్‌ ఆజం మృతదేహం, ఇన్‌సెట్‌లో ఆజం (ఫైల్‌)

సాక్షి, చాంద్రాయణగుట్ట: పిల్లలను ఎత్తుకెళ్లే దొంగలని అపోహ పడి కర్ణాటకలో జరిగిన దాడిలో ఓ హైదరాబాద్‌వాసి దుర్మరణం పాలయ్యాడు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్‌ ఎర్రకుంట ప్రాంతానికి చెందిన సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మహ్మద్‌ ఆజం (32), సల్మాన్, నూర్‌ మహ్మద్, ఖతర్‌ దేశస్థుడు సాలం స్నేహితులు. సాలం ఖతర్‌ నుంచి రావడంతో సరదాగా గడిపేందుకు అంతా కలిసి కర్ణాటకలోని బీదర్‌ జిల్లా ఉద్గీర్‌కు వెళ్లారు. శుక్రవారం సాయంత్రం సమయంలో స్థానిక చిన్నారులకు విదేశీ చాక్లెట్లిచ్చారు.

ఇది చూసిన స్థానికులు వారిని పిల్లలను ఎత్తుకెళ్లే దొంగలనుకుని మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఆజం అక్కడికక్కడే మృతి చెందగా మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారు నగరంలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆజంకు భార్య, కుమారుడున్నారు. శనివారం సాయంత్రం ఎర్రకుంట శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. బాధిత కుటుంబాలను మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement