పట్టపగలు తెగబడ్డ చైన్ స్నాచర్లు
పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: పట్టపగలు మహిళల మెడలోని గొలుసులు తెంపుకుని పరారవుతున్న ఇద్దరు చైన్ స్నాచర్లను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన రామనగరలో చోటుచేసుకుంది. అక్రంబాష, మునరుల్ షేక్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం రామనగర రాయరదొడ్డి సర్కిల్లో నిందితులు ఇద్దరూ తలుపులు కొట్టి తాగడానికి నీళ్లు అడిగి మహిళలు బయటకు వచ్చి నీళ్లు ఇచ్చే సమయంలో చైన్లు లాక్కుని పరారయ్యారు. మహిళలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పట్టుకుని చితకబాదారు. నిందితులు వచ్చిన బైక్ డిక్కీలో కత్తులు, కారంపుడి, ఇతర వస్తువులు దొరికాయి.అ నంతరం పోలీసులకు అప్పగించారు. ఐజూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.